'పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు, జగన్కు కనిపించడంలేదు.. ఇదే జగనిజం'
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పైన మంత్రి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మేడా చేసిన ఆరోపణలను ఖండించారు. మేడాతో ప్రజలు లేరని చెప్పారు.
50 కీలక నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ దృష్టి: ఆ స్థానాన్ని వారికి వదిలేసే ఛాన్స్
బురదలో ఇరుక్కుంటావ్, మాపై బురదనా?
మల్లికార్జున్ రెడ్డి పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరికాదన్నారు. మేడా వెంట కార్యకర్తలు ఎవరూ లేరన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి ఈయనకు తెలుసా అన్నారు. నీవు బురదలో ఇరుక్కుంటావని తెలియక, వెళ్తూ వెళ్తూ మాపై బురద జల్లుతావా అన్నారు.
జగన్ క్యారెక్టర్ తెలుసు
జగన్ క్యారెక్టర్ ఏమిటి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏమిటో ప్రజలకు తెలుసునని చెప్పారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్ తన కొడుకు కేటీ రామారావును జగన్ వద్దకు పంపించారని గుర్తు చేశారు. తెలంగాణలో జగన్ తన పార్టీని ఎత్తేశారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పోటీ చేయలేదని, ఇప్పుడు ఇక్కడకు వస్తామని చెబుతున్నారని, అమరావతి ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారన్నారు.
పవన్ కళ్యాణ్ చెప్పారు, జగన్కు కనిపించడం లేదా?
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల గురించి జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆదినారాయణ రెడ్డి అడిగారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు రావాలనే అంశంపై జనసేన వేసిన జయప్రకాశ్ నారాయణ కమిటీ తేల్చిందని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం వేల కోట్లు ఇవ్వాలని చెబుతున్నారని, అది జగన్కు కనిపించడం లేదన్నారు. కేసుల కోసం జగన్ కేంద్రంతో లాలూచీ పడ్డారని, తెలంగాణలో దోచిన ఆస్తుల కోసం కేసీఆర్తో లాలూచీ అన్నారు. ఇక్కడ జగన్ పప్పులే ఉడకడం లేదని, ఇక మేడా ఏం పొడుస్తారన్నారు. ఈ దొంగ మాటలు మానుకోవాలన్నారు.
అదే జగనిజం
జగన్ ఏ రోజు నిజం చెప్పడని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇది జగనిజం అని ఎద్దేవా చేశారు. నో నిజం.. అదే జగనిజమన్నారు. ఆయనకు సాక్షి టీవీ, పేపర్ ఉందని, లేదని చెబుతారని, లోటస్ పాండ్ ఉందని, బెంగళూరు ప్యాలెస్ ఉందని, భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని, నాది కాదంటారని, గాలి జనార్ధన్ రెడ్డి తనకు తెలియదని చెబుతారన్నారు. తాను చెప్పిందే వేదమని, ఇతరులు ఏం చెప్పినా అబద్దమని జగన్ అంటారని విమర్శించారు. కేసీఆర్ పాలన కంటే మన పాలన బాగుందని చంద్రబాబుకు తాను చెప్పానని అన్నారు. గతంలో కంటే ప్రజలు ఎక్కువ సీట్లు ఇస్తారని చెప్పానని అన్నారు.