వైసీపీ గాలి తీస్తున్న బీజేపీ ఎమ్మెల్యే, ఏపీఎన్జీఓ భవనం ఏం చేశారో తెలుసా అంటూ ?
కర్నూలు జిల్లాలోని ఆదోనిలో రాజకీయలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆదోని నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా డాక్టర్ సార్ పార్థసారథి విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో టీడీపీకి కంచుకోట అయిన ఆదోని ఇప్పుడు బీజేపీ ఖాతాలో పడింది. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మరో అడుగు ముందుకు వేశారు.
గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలకు, భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో ఆ పార్టీపై ఆరోపణలు చేసిన డాక్టర్ పార్థసారథి ఆదోనిలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పొత్తులో భాగంగా కూటమి నాయకులు ఆదోని నియోజక వర్గాన్ని అప్పట్లో బీజేపీకి వదులుకున్నారు. లక్కీ ఛాన్స్ కొట్టిన డాక్టర్ పార్థసారథి ఆదోనిలో ఎమ్మెల్యే కూడా అయిపోయారు.

ఆదోని పట్టణంలో ఏపీఎన్జీవో కార్యాలయాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రిస్వామి పేరుతో 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. వైసీపీ నాయకుడు ఎర్రిస్వామి లీజుకు తీసుకున్న ఏపీఎన్జీవో కార్యాలయాన్ని నేలమట్టం చేసిన వైసీపీ నాయకులు అదే ప్రాంతంలో సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా కట్టడాలు నిర్మించారని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపిస్తున్నారు.
ఆదోనిలో వైసీపీ చేసిన అక్రమాలను ప్రజలందరికీ తెలిసిచెప్పేలా ఆ పట్టణంలోని ప్రధాన సర్కిల్స్ లో బీజేపీ నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏపీఎన్జీవో కార్యాలయాన్ని అక్రమంగా లీజుకు తీసుకున్న వైసీపీ నాయకులు అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఆ పార్టీ కార్యలయాన్ని నిర్మించారని ప్రచారం చేస్తూ ఆదోని పట్టణంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు అనుకుంటే ఏమైనా చేస్తారని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ అంటూ ఫెక్సీలు ఏర్పాటు చేశారు.

చివరికి ఏపీఎన్జీవో కార్యాలయం కూడా అక్రమంగా లీజుకు తీసుకుని ఇలా వైసీపీ కార్యాలయం చేసేశారని ఆదోని బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపోవడం, ఎవరికి వారే అంటూ వారివారి కార్యక్రమాు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కలిసి రావడంతో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆయన స్టైల్ లో వైసీపీ నాయకులపై మండిపడుతున్నారు.
మొత్తం మీద ఆదోనిలో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలను ఆ ప్రాంతంలోని ప్రజల ఆసక్తిగా గమనిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ఇలా చేస్తున్నామని, గతంలో వారు చేసిన అక్రమాలు అన్ని బయటకు తీసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెలుతామని ఆదోని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అంటున్నారు.












Click it and Unblock the Notifications