జగన్తో యోగి ఆదిత్యనాథ్ రాయబారి కీలక భేటీ: ఆ మూడు అంశాలపై ఆరా..!!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ సీఎం ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో కీలకమైనవి.. విద్య, వైద్యం, వ్యవసాయం. నాడు-నేడు కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల రూపురేఖలను మార్చివేసింది ప్రభుత్వం. కోట్లాది రూపాయలను దీనికోసం ఖర్చు చేస్తోంది. నాడు-నేడు కింద ఇప్పటివరకు 6,500 కోట్ల రూపాయలను వ్యయం చేసింది.
నాడు-నేడు కింద..
ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లోనూ ఈ పథకానికి భారీగా నిధులను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తోంది ప్రభుత్వం. ఆర్వో మంచినీటి ప్లాంట్లను పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కళాశాలలు, విద్యాసంస్థలకు ధీటుగా అభివృద్ధి చేస్తోంది. వారికి యూనిఫామ్ సహా పాఠ్యపుస్తకాలను అందిస్తోంది.
వైద్యానికీ..
అదే తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా మౌలిక సదుపాయాలను కల్పించడంలో వెనుకాడట్లేదు జగన్ సర్కార్. ప్రభుత్వ పాఠశాలలకు వర్తింపజేస్తోన్న ఇదే పథకం పరిధిలోకి ఆసుపత్రులను కూడా తీసుకొచ్చింది. వేల కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. వాటిని అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. దీనికి అదనంగా విలేజ్ క్లినిక్ లను నిర్మిస్తోంది. ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతోంది. ఈ రంగానికి కూడా ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించే అవకాశాలు లేకపోలేదు.
వ్యవసాయంపై..
ఈ రెండింటి స్థాయిలో వ్యవసాయ రంగానికి కూడా జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. రైతు భరోసాను అమలు చేస్తోంది. గ్రామీణ స్థాయిలో ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంట నష్టాన్ని ఏ సీజన్ కు ఆ సీజన్ లో విడుదల చేస్తోంది. అదే సమయంలో వైఎస్ఆర్ జలకళ పథకం పేరుతో ప్రభుత్వమే రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తోంది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాలన్నింటినీ పలు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆకర్షించాయి.
సంక్షేమ పథకాలపై..
తాజాగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం- ఈ మూడు పథకాలను అధ్యయనం చేస్తోంది. దీనికోసం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా ఏపీకి వచ్చారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి స్వయంగా ఆయనకు వివరించారు.
అధ్యయనం చేస్తోన్నాం..
అనంతరం తనను కలిసిన విలేకరులతో సాకేత్ మిశ్రా మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను అధ్యయనం చేయడానికి తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకు ఆయా పథకాలను ఏపీ ప్రభుత్వం ఎలా అందిస్తోందనే విషయంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇన్ని కోట్లమందిని సమన్వయం చేసుకుంటూ చిట్టచివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాల లబ్దిని అందజేయడం గొప్ప విషయమని ప్రశంసించారు.
పొంగులేటితో వైఎస్ షర్మిల మంతనాలు- భారీ ఆఫర్: ఆ ఒక్కటీ తప్ప..!!