ఇప్పటంపై రూటు మార్చిన పవన్ ? టూర్ క్యాన్సిల్ ! ఏం జరుగుతోంది?
ఏపీలో ఈ మధ్య కాలంలో ఇప్పటం గ్రామం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ అడగ్గానే స్ధలం ఇవ్వడం దగ్గరి నుంచి హైకోర్టులో గ్రామస్తులు పెట్టించుకున్న చీవాట్ల వరకూ అన్నీ సంచలనాలే. దీంతో ఇప్పటం గ్రామానికి అండగా నిలవాలని గతంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ మరో నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటం ట్విస్టుల పర్వం
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడతానని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం గతంలో వేదికైంది. అప్పటి నుంచి ఇప్పటంతో పవన్ కళ్యాణ్ బంధం పెనవేసుకుపోయింది. జనసేన ఆవిర్భావ సభకు స్ధలం ఇచ్చిన ఇప్పటం గ్రామానికి పవన్ 50 లక్షల సాయం ప్రకటించడం, దాన్ని సీఆర్డీయే ఖాతాలో జమ చేయమని అధికారులు ఒత్తిడి చేయడం, ఈ ప్రతిపాదనను గ్రామస్తులు తిరస్కరించడం, చివరికి గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేత, నోటీసులివ్వలేదని హైకోర్టులో గ్రామస్తుల పిటిషన్లు, నోటీసులిచ్చినట్లు అధికారులు హైకోర్టుకు చెప్పడం, ఆగ్రహంతో హైకోర్టు జరిమానా విధించడం, ఆలోపు కూల్చివేతల బాధితులకు పవన్ లక్ష రూపాయల చొప్పున సాయం ప్రకటించడం, ఇప్పుడు దాని చెల్లింపు ఇలా ప్రతీదీ ఓ ట్విస్టే.
హైకోర్టు ఆగ్రహంతో మారిన సీన్
ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టినా ఆ విషయాన్ని దాచి గ్రామస్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు కూల్చివేతలు ఆపేసింది. చివరికి విషయం బయటపడటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్లకు తలో లక్ష చొప్పున జరిమానా విధించింది. దీంతో ఇప్పటం గ్రామస్తులకు అప్పటివరకూ లభించిన సానుభూతి కాస్తా ఆవిరైంది. ఇప్పుడు ఇప్పటం వైపు వెళ్లేందుకు జనసేనే కాదు ఇతర రాజకీయ పార్టీల నేతలు సైతం ఆలోచించుకోవాల్సిన పరిస్దితి.
రూటు మార్చిన పవన్?
ఇప్పటం గ్రామంలో కూల్చివేతల వ్యవహారంపై వెంటనే స్పందించి అక్కడికి వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. అంతే కాదు వైసీపీ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. అలాగే బాధితులకు లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తానని కూడా ప్రకటించారు. రేపు ఇప్పటం వెళ్లి గ్రామంలోనే బాధితులకు చెక్కులు పంపిణీ చేయాలని కూడా భావించారు. కానీ హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా రూటు మార్చుకోక తప్పలేదు.
పవన్ తాజా నిర్ణయమిదే!
ఇప్పటం గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టును తప్పుదోవ పట్టించేలా ఉండటంతో వాటిని కొట్టేసింది. అదే సమయంలో ఇప్పటం గ్రామంలో పర్యటనకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ కూడా దాన్ని విరమించుకున్నారు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటంలో పర్యటిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లడానికి బదులుగా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికే బాధితుల్ని పిలిపించి లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తద్వారా గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సాయం చేసినట్లు ఉంటుందని, ఇప్పటం వెళ్లకుండానే బాధితులకు ఊరట కలిగించినట్లవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.