కూతురు కోసం లండన్ వెళ్లాలనుకున్న జగన్, హఠాత్తుగా రద్దు, ఎందుకంటే?
అమరావతి: అధికార, ప్రతిపక్ష నేతల విదేశీ పర్యటనలు గురువారం రద్దు అయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. చంద్రబాబు స్థానంలో మంత్రులు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారుల బృందం వెళ్లనుంది.
2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే పవన్ ఆయా జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించారు. త్వరలో జిల్లాల్లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకోనున్నారు. జగన్ పాదయాత్ర ఇటీవలే పూర్తయింది.
ప్రభాస్ ఇష్యూ: షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు, రంగంలోకి ప్రత్యేక దర్యాఫ్తు బృందం
లండన్ పర్యటనకు ప్లాన్ చేసుకున్న జగన్
ఎన్నికలు సమీపిస్తున్నందున చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతి రోజు అర్ధరాత్రి వరకు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో నేతల చేరికలు, అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు, జగన్ తన పాదయాత్ర ముగింపు అనంతరం లండన్ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు.
పార్టీ అభ్యర్థుల ఎంపికపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాల దృష్ట్యా, ఎన్నికల వేడి రాజుకున్నందున జగన్ తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. జగన్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై సమీక్ష చేయనున్నారు. జగన్ కూతురు లండన్లో చదువుతున్నారు. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. కూతురును చూసేందుకు కుటుంబ సమేతంగా వెళ్లాలని భావించారు. కానీ ఇప్పుడు ఎన్నికల హడావుడి కారణంగా దానిని రద్దు చేసుకున్నారు.
ఎన్నికల షెడ్యూల్ తర్వాత బస్సుయాత్ర
ఎన్నికల షెడ్యూల్ వచ్చాక జగన్ బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. బస్సు యాత్రకు ముందే జిల్లాల వారీగా సమీక్షలు పూర్తి చేయనున్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జరిగిన పాదయాత్రతో జగన్ వైసీపీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. సమీక్షలు నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో అతివిశ్వాసం, వ్యూహాల్లో లోపం కారణంగా ఓడిపోయారనే వాదనలు ఉన్నాయి.
అలాంటి పొరపాటు జరగొద్దు
ఈ నేపథ్యంలో అలాంటి పొరపాటు జరగకుండా జగన్ నేతలకు గట్టిగానే చెప్పనున్నారని తెలుస్తోంది. టీడీపీ, వైసీపీలు ఇప్పటికే దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇబ్బందికరంగా ఉన్నచోట్ల షార్ట్ లిస్ట్ తయారు చేస్తున్నారు.