వివేకా కేసులో హైకోర్టు ఉత్తర్వులు ఎనిమిదో వింత ! సుప్రీంలో సీబీఐ వ్యాఖ్యలు-కౌంటర్ కు రెడీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. సీబీఐ వినతి మేరకు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. తీర్పులో సీబీఐ దర్యాప్తు పూర్తికాగానే ఆటో మేటిక్ బెయిల్ తీసుకోవచ్చంటూ చేసిన సూచన ఇప్పుడు సుప్రీంకోర్టులో కలకలం రేపుతోంది.
ఎర్ర గంగిరెడ్డికి వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసేందుకు పెట్టిన గడువు జూన్ 30 పూర్తి కాగానే బెయిల్ తీసుకోవచ్చంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటుపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఇప్పటికే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇవేం ఉత్తర్వులంటూ అసహనం కూడా వ్యక్తం చేసిన సీజేఐ.. దీనిపై విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసులో విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందు సీబీఐ కూడా ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటును ఎనిమిదో వింతగా సుప్రీంకోర్టులో సీబీఐ న్యాయవాది అభివర్ణించారు. దీనిపై సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు ఒక్క రోజు గడువు కావాలని ఆయన కోరారు.
కాబట్టి ఒక్క రోజు తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీం ధర్మాసనాన్ని సీబీఐ న్యాయవాది కోరారు. అదే సమయంలో గంగిరెడ్డి తరఫు న్యాయవాది కూడా ప్రత్యేక ఎస్ఎల్పీ దాఖలు చేయడంతో విచారణ వాయిదా పడింది.
గంగిరెడ్డి బెయిల్ కు తెలంగాణ హైకోర్టు పెట్టన నిబంధనల్ని సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ తో పాటు గంగిరెడ్డి దాఖలు చేసే ఎస్ఎల్పీని కూడా కలిపి విచారించాలని జస్టిస్ నరసింహ ధర్మాసనం నిర్ణయించింది. ఈ నెల 26 అంటే ఎల్లుండి ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు గంగిరెడ్డికి బెయిల్ ఎప్పటివరకూ అనేది తేల్చబోతోంది.












Click it and Unblock the Notifications