జగన్ లో ఓటమి తెచ్చిన మార్పు - కీలక నిర్ణయం..!!
జగన్ లో ఊహించని మార్పు. ముఖ్యమంత్రిగా జగన్ తీరు పైన అనేక విమర్శలు వినిపించాయి. ఓటమికి జగన్ శైలి ఒక కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మీడియాకూ పూర్తి దూరం పాటించిన జగన్..ఇప్పుడు గంటల కొద్దీ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతల కోసం కీలక నిర్ణయం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు.
జగన్ లో కొత్త మార్పు
మాజీ సీఎం జగన్ లో పార్టీ శ్రేణులు కోరుకుంటున్న మార్పు మొదలైంది. ముఖ్యమంత్రిగా తమతో జగన్ మమేకం కావాలని నాడు కేడర్ కోరుకుంది. ఎమ్మెల్యేలు సైతం పలు సందర్భాల్లో జగన్ ను కలిసేందుకు ప్రయత్నించినా అప్పాయింట్ మెంట్ దొరకలేదు. నియోజకవర్గాల పనులను సైతం సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి నిర్ణయం మేరకే ఉండేది. ముఖ్యమంత్రిగా జగన్ ను కలిసే అవకాశం లేకపోవటం పైన ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఫలితాల తరువాత
ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ ప్రజలతో దూరంగా ఉన్నారు. పథకాల అమలు సమయంలో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొనటం మినహా ప్రజలతో మమేకం అయ్యేలా వ్యవహరించ లేదు. పూర్తిగా జగన్ నమ్ముకున్న సలహాదారులు...అధికారులే పాలనలో కీలకంగా వ్యవహరించారు. ఇది పార్టీ నేతలకు రుచించలేదు. ఇక...ఇప్పుడు ఓటమి తరువాత జగన్ లో మార్పు కనిపిస్తోంది. ఈ నెల రోజుల కాలంలోనే నాలుగు సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. వారితో సమావేశం అవ్వటంతో పాటుగా విందుకు ఆహ్వానించారు.
కీలక నిర్ణయాలతో
పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. త్వరలో పార్టీలో కింది స్థాయి నుంచి పూర్తి ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం పార్టీ పదవుల్లోనూ మార్పులకు సిద్దమయ్యారు. అదే విధంగా తన తాడేపల్లి నివాసంలోనే ప్రజాదర్బార్ ను ఆగస్టు తొలి వారం నుంచి ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఈ మేరకు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ నేతల కోసం ప్రతీ రోజు సమయం కేటాయించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 తరువాత జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications