వైసీపీ ఇన్నాళ్లూ బాధపడింది చాలు -రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నా -ముంబై ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్
అనర్హత వేటు వ్యవహారం ఇంకా తేలకపోవడంతో సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. 'రాజధాని రచ్చబండ'పేరుతో తరచూ మీడియా ముందుకొచ్చే ఆయన, ఆయన గత నెలరోజులుగా అనారోగ్యకారణాల ఉధృతి తగ్గించారు. గుండెకు సంబంధించిన సమ్యలు రావడంతో ముంబైలోని ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై బుధవారం ఆయన మరో ప్రకటన చేశారు..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
సొంత పార్టీకి, సీఎం జగన్ కు సవాళ్లు విసురుతోన్న వైసీపీ ఎంపీ రఘురామకు హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడినట్లు తెలియడంతో గత నెలలో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్లో చేరారు. డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలోని బృందం ఎంపీకి బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. ఈనెల ఐదు నాటికే ఆపరేషన్ పూర్తయిందని ఎంపీ తెలిపారు. ఆరోగ్యం కుదుటపడటంతో బుధవారం ఆయనను డిశ్చార్జ్ చేశారు. ముంబై నుంచి నేరుగా హైదరాబాద్ లోని ఇంటికి వెళుతున్నట్లు రఘురామ చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు ఆయన మళ్లీ చురకలు వేశారు...

రఘురామ అనారోగ్యంపై రూమర్లు
గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగంలోని కొందరు పుకార్లు పుట్టించి, తప్పుడు వార్తను సర్క్యులేట్ చేస్తున్నారని, వికారమైన కామెంట్లతో తిట్టిపోస్తూ రాక్షస ఆనందం అనుభవిస్తున్నారని, ప్రజాధనాన్ని వాడుకుంటోన్న వైసీపీ సోషల్ సైన్యాలు ప్రజల్ని పీక్కుతింటున్నాయని ఎంపీ రఘురామ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఆరోగ్యంపై అంతలా తప్పుడు ప్రచారాలు చేసినవాళ్లు ఇకపై బాధపడొద్దని ఎద్దేవా చేశారు.

4వారాలు నో విజిటర్స్
‘‘ముంబై ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అవుతున్నాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్నవాళ్లకు, నా పేరుతో దేవాలయాల్లో పూజలు చేసినవాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంపూర్ణ ఆరోగ్యంతో నేను తిరిగి హైదరాబాద్ ఇంటికి వెళుతున్నాను. సాధారణంగా హార్ట్ సర్జరీ చేయించుకున్నవాళ్లు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అందునా ఇప్పుడు కరోనా కూడా ఉంది కాబట్టి ఇతర వ్యక్తులను నేరుగా కలవొద్దని డాక్టర్లు సూచించారు. రాబోయే మూడు నాలుగు వారాలు నాలో ఇమ్యూనిటీ లెవల్స్ కాస్త తక్కువ ఉంటాయని చెప్పారు. కాబట్టి నేను ఎవరినీ నేరుగా కలవలేను. అయితే, ప్రస్తుత మోడ్రన్ యుగంలో మనుషుల్ని ఫేస్ టు ఫేస్ కలవలేకపోయినా, ఫేస్ టైమ్ లో నిత్యం మాట్లాడుకోవచ్చు. అంతేకాదు..

వైసీపీ బాధపడింది చాలిక..
వ్యక్తుల్ని నేరుగా కలవలేకపోయినా వీడియో కాల్స్, సోషల్మడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటాను. నిజం చెప్పాలంటే గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో అన్నింటిలో పాల్గొంటాను. నన్ను అభిమానించే అందరికీ ధన్యవాదాలు. అలాగే, నాకు దురభిమానులైన యుశ్రారైకాపా(వైసీపీ) వాళ్లకు కూడా ఒక విషయం చెప్పదలిచాను. నా ఆరోగ్యం గురించి చాలా బాధపడుతూ, ఏడుస్తూ, తప్పుడు వార్తలు షేర్ చేసుకుని ఆనందం పొందారు. ఇన్నాళ్లూ మీరు పడిన బాధ చాలు. ఇకపై వైసీపీ వాళ్లు నా గురించి బాధపడకండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. రెండు మూడు రోజుల్లో సోషల్ మీడియా ద్వారా మళ్లీ రంగంలోకి దిగుతా..''అని ఎంపీ రఘురామ చెప్పారు.












Click it and Unblock the Notifications