సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ తాజా అప్ డేట్ ఇదే..!
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుందని చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై ఇవాళ కూడా వాడీవేడిగా వాదనలు సాగాయి. గత విచారణ సందర్భంగా చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించగా.. ఇవాళ సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ సందర్భంగా ఆయన పలు పాత కేసుల్ని, తీర్పుల్ని ప్రస్తావించారు.

చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందన్నారు. చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పుడు చట్టమే వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని తెలిపారు.
దీనిపై స్పందించిన చంద్రబాబు లాయర్ లూథ్రా.. కేసులుపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారని ఆరోపించారు. స్కిల్ కేసు విచారణకు ఫైబర్నెట్ కేసుతో సంబంధం ఉందన్నారు. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారంట్ తీసుకున్నారని గుర్తుచేశారు. ఇక్కడ కూడా 1ఏ ను ఛాలెంజ్ చేస్తున్నారా అని లూథ్రాను న్యాయమూర్తి జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. అవును.. 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని సిద్ధార్థ లూథ్రా తెలిపారు.
ఆ తర్వాత కూడా దీనిపై వాదనలు సాగినా ఇవాళ ముగించే అవకాశం లేకపోవడంతో ఇరువైపులా లాయర్ల అంగీకారంతో కేసు విచారణను వచ్చే మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా ప్రారంభమైనా అది కూడా మంగళవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications