తగ్గండి: కేసీఆర్కి కిషన్, అదనపు విద్యుత్కి గోయల్ నో
హైదరాబాద్/ఢిల్లీ/మెదక్: నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకి కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఢిల్లీ పర్యటన ద్వారా తెలుసుకున్నారని, మోడీ తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకని పదేపదే విమర్శలు చేసి బురద చల్లేందుకు ప్రయత్నించారని, మోడీని కేసీఆర్ కలిసిన నేపథ్యంలో గతంలో ఆయన కుటుంబ సభ్యులు చేసిన విమర్శలు, ఆరోపణలు తప్పని అర్థం చేసుకోవాలని, వాటిని వెనక్కి తీసుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా వారు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించే విషయమై మజ్లిస్ పార్టీ వద్దనడంతో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉందని, ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.
అదేవిధంగా ఎన్టీపీసీలో 1320 మెగావాట్ల బొగ్గు ఆదారిత విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయమై గోయల్ శనివారం తనతో మాట్లాడారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుప్రీం కోర్టు జస్టిస్కు లేఖ రాసిందని, మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు.
హరీశ్రావును బర్తరఫ్ చేయాలి: నాగం
నిర్మాణంలో జరిగిన అవకతవకల కారణంగా మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ మునిగిపోయిందని, దీనికి బాధ్యుడిగా చేస్తూ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
దాదాపు రూ. 400-500 కోట్ల వరకు నిధులు దారి మళ్లాయని ఆరోపించారు. ఏబీఎన్, టీవీ9 చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు చానెళ్లను భయపెడితే మిగతా చానెళ్లు, పత్రికలు భయపడతాయన్న ఉద్దేశంతో ప్రసారాలు నిలిపివేశారని ఆరోపించారు. ప్రజల గొంతును వినిపించే స్వేచ్ఛ ప్రచార, ప్రసార సాధనాలకు ఉంటుందన్నారు.
అదనపు విద్యుత్ ఇవ్వలేం: గోయల్
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు కొరత, కోతలు తీర్చడానికి ఇప్పటిక్పుపుడు కేంద్రం వాటా నుంచి అదనంగా విద్యుత్తు ఏమీ ఇవ్వలేమని, ప్రస్తుతమిస్తున్న వంద మెగావాట్లను మాత్రమే వచ్చే మార్చి వరకు సరఫరా చేస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. కేంద్రం కోటాలో ప్రస్తుతం మిగులు విద్యుత్ లేనందువల్లే అదనంగా ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆయనను ఆదివారం కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే.