పవన్ కళ్యాణ్ హెచ్చరిక, ఇక రంగంలోకి జగన్: ఇరుకునపడ్డ బాబు, జాగ్రత్త!
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఫుడ్ పార్కు విషయమై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం చంద్రబాబు హఠాత్తుగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం భీమవరం టిడిపి ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు.
రేపే తాను ఆక్వా ఫుడ్ పార్క్ యాజమాన్యంతో మాట్లాడుతానని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. వ్యర్థాలు డ్రెయిన్లోకి వెళ్లకుండా సముద్రంలోకి వ్యర్థాలు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. యనమదుర్రు డ్రైన్ను కూడా శుద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు.
ప్రజలు నష్టపోకుండా, ప్రజలకు మేలు జరిగేలా, వారి అనుమానాలన్నీ తీరుస్తామన్నారు. పరిశ్రమల వల్లే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పరిశ్రమలతో పాటు, ప్రజల సంక్షేమం కూడా తమకు కావాలన్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ఇప్పటికే రూ.25 కోట్లు ఖర్చు చేశారన్నారు.

వేరు ప్రాంతానికి తరలించలేమని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆక్వాఫుడ్ పార్క్పై చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ వద్దని ఎవరూ కోరుకోవట్లేదని, వ్యర్థాలతో నీరు కలుషితం అవుతుందని భయపడుతున్నారన్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు, భయాలను తొలగిస్తామని, కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ప్రజలతో చర్చిస్తుందని వెల్లడించారు.
అభివృద్ధి కోసమే: చంద్రబాబు
పారిశ్రామిక అభివృద్ధి కోసమే మెగా ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల వల్లే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పారిశ్రామికవాడల్లో సంయుక్త శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫుడ్ పార్క్ వ్యర్థాలను పైపులైన్ ద్వారా సముద్రంలో కలిసేలా చూడాలన్నారు. యనమందుర్రు డ్రెయిన్ను శుద్ధి చేయాలని ఆదేశించారు. సమస్య పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామన్నారు. ఇప్పటికే రూ.25 కోట్లు ఖర్చు చేశామని, పార్కును తరలించలేమని ప్రజలకు చెప్పాలని సూచించారు.
అంతకుముందు, గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ వ్యవహారంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ఆరా తీశారు. ఆక్వా ఫుడ్పార్క్పై భయాందోళనలను సీఎం పరిగణనలోకి తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగనివ్వవద్దని అధికారులకూ సూచించారని తెలుస్తోంది.
సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్, భీమవరం ఎమ్మెల్యే, నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు, మత్స్యశాఖ, ఎంపెడ, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆక్వాఫుడ్ పార్క్ ప్రాంతంలోని 144 సెక్షన్ అమలు, ఆందోళనకారులపై కేసులు, బాధితులు శనివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను కలవడం, ఈ నెల 19న ప్రతిపక్షనేత జగన్ ఆక్వా ఫుడ్ పార్క్ ప్రాంతంలో పర్యటించనుండటంతో ముఖ్యమంత్రి సమీక్షకు ప్రాధాన్యమేర్పడింది. పవన్ హెచ్చరిక, జగన్ రాక నేపథ్యంలో టిడిపి అప్రమత్తం కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications