అప్పట్లో అది.. ఇప్పుడు ఇది.. బెడిసికొట్టిన చంద్రబాబు వ్యవహారాలు
అదేంటో గానీ ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో కొన్ని వ్యవహారాలు బెడిసికొట్టడం ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న చికాగో యూనివర్సిటీ చంద్రబాబుకు డాక్గరేట్ ప్రధానం చేయబోతుందని ఊదరగొట్టేసి టీడీపీ వర్గాలు బోల్తా పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా అజయ్ దేవగన్ నియమించాలని ప్రయత్నిస్తున్న టీడీపీ సర్కార్ కి ఊహించని షాక్ తగిలింది.
ప్రపంచవ్యాప్తంగా నల్లధనాన్ని పెద్ద ఎత్తున మూటగట్టిన బడాబాబుల పేర్లను, పనామా లీక్స్ బయటపెడుతున్న క్రమంలో అజయ్ దేవగన్ పేరు కూడా జాబితాలో చేరడంతో.. చంద్రబాబు నిర్ణయం బెడిసికొట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనామా వెలువరించిన వివరాల ప్రకారం.. బ్రిటన్ లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరీబోలిన్ ఎంటర్టైన్ మెంట్ అనే సంస్థలో అజయ్ దేవగన్ కు భారీ మొత్తంలో షేర్లు ఉన్నాయని పేర్కొంది. ఇదే కంపెనీలో అజయ్ భార్య కాజల్ కూడా సంస్థ సభ్యురాలుగా ఉన్నారు.

విషయంపై స్పందించిన అజయ్ దేవగన్ మాత్రం.. పనామా లీక్స్ తన గురించి బయటపెట్టిన వివరాలను ఖండించాడు. మేరీబోలిన్ ఎంటర్టైన్ మెంట్ కంపెనీకి 2013 లో డైరెక్టర్ గా వ్యవహరించిన అజయ్ 2014 లో సంస్థ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన ఆర్థిక వ్యవహారాలన్ని నిబంధనలకు లోబడే నడిచాయని చెప్పుకొచ్చిన అజయ్ తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు.
అప్పట్లో చంద్రబాబుకు చికాగో యూనివర్సిటీ డాక్గరేట్ ప్రధానం చేస్తోందని టీడీపీ అనుకూల వర్గాలు తెగ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తీరా చూస్తే.. ఆ పేరు మీద అమెరికాలో రెండు యూనివర్సిటీలు ఉన్నాయని తేలింది. అందులో చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తానన్న వర్సిటీ ఓ నామమాత్రపు వర్సిటీ అన్న విషయం తెలిసి ఇక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక ఇప్పుడు అజయ్ దేవగన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టే ప్రయత్నాలు సాగుతుండగానే పనామా లీక్స్ అజయ్ పేరును బయటపెట్టి గట్టి షాక్ ఇచ్చింది. మరి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అంబాసిడర్ గా నియమించి ఏపీ ప్రతిష్టను దిగజారుస్తారో.. లేక నిర్ణయాన్ని మార్చుకుంటారో.. రానున్న రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications