టీడీపీకి 2019లో అగ్రిగోల్డ్ బాధితుల దెబ్బ...ఈ నెల 30,31 తేదీల్లో ఆత్మఘోష పాదయాత్ర
గుంటూరు: అగ్రిగోల్డ్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈనెల 30, 31 తేదీల్లో వేలాది మంది అగ్రిగోల్డ్ బాధితులతో గుంటూరు నుంచి అమరావతి సచివాలయ్ వరకు పాదయాత్ర చేస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అగ్రిగోల్డ్ బాధితుల దెబ్బ తగలయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30, 31 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మఘోష పాదయాత్ర వివరాలు వెల్లడించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేయడం లేదన్నారు. ఈ సమస్యపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం నేటికి సమావేశం కాలేదని చెప్పారు.
మరోవైపు బాధితులు మాత్రం తమకు న్యాయం జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూపులు చూస్తున్నారన్నారు. కానీ అగ్రిగోల్డ్ సమస్యపై పాలకుల్లో ఏ విధమైన చలనం లేదని ఆయన విమర్శించారు. అందుకే ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుంటూరు నుంచి వెలగపూడి వరకు "ఛలో సెక్రటేరియట్" కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అయితే ఈ యాత్ర ఆద్యంతం శాంతియుతంగా కొనసాగుతుందని, పోలీసులకు పని పెట్టకుండా శాంతియుతంగా ఈ నిరసన పాదయాత్ర చేపడతామని వివరించారు.
అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 20 లక్షల మంది ఉన్నాదని, వీరిపై టీడీపీ మహానాడులో తీర్మానం చేయాలని ఆయన కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలను గమనించి వారిని ఆదుకునేందుకు వెంటనే రూ. 3,965 కోట్లు విడుదల చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావున డిమాండ్ చేశారు. మరోవైపు అగ్రిగోల్డ్ వ్యవహారంతో మానసిక క్షోభకు గురైన బాధితులు ఆత్మహత్యలకు పాల్పడకుండా తమ అసోసియేషన్ ఎంతో కృషి చేస్తోందని ముప్వాళ్ల నాగేశ్వరరావు వివరించారు.