అగస్టా స్కాం షాకింగ్, టెక్కలికి సెగ: ఆ కంపెనీ కొనుగోలు, లాకౌట్ వెనుక..!
శ్రీకాకుళం: అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిని తాకింది. కుంభకోణం పరిశోధనలో టెక్కలి పేరు వెలుగులోకి రావడంపై స్థానికంగా చర్చనీయం అయింది. ఈడి అధికారులు సోమవారం నాడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా పదిచోట్ల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితం అధికారులు హైదరాబాదులో సోదాలు, దర్యాఫ్తుకు వచ్చినప్పుడు టెక్కలి పేరు తెరపైకి వచ్చింది. టెక్కలి సమీపంలోని ఓ పరిశ్రమను దుబాయ్కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి.
అగస్టా స్కాం: హైదరాబాద్ సహా పలుచోట్ల సోదాలు, రూ.86 కోట్ల షేర్లు సీజ్
కేవలం నల్లధనాన్ని మార్పిడి చేసుకునేందుకే ఈ లావాదేవీలు నడిపినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. ఆ పరిశ్రమను కొనుగోలు చేసిన దుబాయ్కి చెందిన సంస్థలో అగస్టా కుంభకోణంలోని వ్యక్తులు పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించిందని చెబుతున్నారు.
ఓ వ్యాపారవేత్త ఇరవై అయిదు సంవత్సరాల క్రితం టెక్కలి సమీపంలో ఈ పరిశ్రమను నెలకొల్పారని, తర్వాత పలు చేతులు మారిందని చెబుతున్నారు. ఇటీవలే ఈ సంస్థ లాకౌట్ ప్రకటించింది. దుబాయ్కి చెందిన సంస్త దీనిని కొనుగోలు చేసి, నల్లధనాన్ని మార్చుకునేందుకు వినియోగించి, ఆ తర్వాత అమ్మేసిందంటున్నారు.