ఏపీ భవన్లో అనుకోని అతిథి
న్యూఢిల్లీః అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యక్షం అయ్యారు. 'అప్నే బాత్-రాహుల్కే సాత్' కార్యక్రమంలో పాల్గొనడానికి రాహుల్ ఏపీ భవన్ను సందర్శించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవలే అప్నే బాత్-రాహుల్ కె సాత్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాస్త్రం చాయ్ పె చర్చకు పోటీగా రాహుల్ గాంధీ భోజన్ పె చర్చను కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ఏపీ భవన్కు చేరుకున్న అనంతరం.. రాహుల్ గాంధీ అక్కడే వీఐపీ క్యాంటీన్ లో భోజనం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కొందరు పారిశ్రామికవేత్తలతో కలిసి రాహుల్ తన మధ్యాహ్న భోజనాన్ని ఏపీ క్యాంటీన్లోనే పూర్తి చేశారు. భోజనం చేస్తూనే పారిశ్రామికవేత్తలో ముచ్చటించారు. అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి అవసరమైన సూచనలు సలహాలను రాహుల్ గాంధీ వారి నుంచి సేకరించారు.
వాటిని మేనిఫెస్టోలో చేర్చుతామని అన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మేనిఫెస్టో రూపకల్పనపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీనికోసం రాహుల్ గాంధీ సహా కీలక నాయకులు తరచూ భోజన్ పె చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చిరు వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలతో కలిసి భోజనం చేస్తూ, వారి అభిప్రాయలను తెలుసుకోవడం, వాటిని మేనిఫెస్టోలో చేర్చడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే విద్యార్థులతో సమావేశం అయ్యారు. విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, రిజర్వేషన్లు, విద్యా ప్రమాణాలపై విద్యార్థుల అభిప్రాయాలు సేకరించారు.