ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం-ప్రయాణికుల లగేజీ లేకుండానే టేకాఫ్.. రచ్చ రచ్చ..
ఏపీలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లిన ఓ ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజీ తీసుకున్న ఎయిర్ ఇండియా సిబ్బంది దాన్ని తిరిగి బెంగళూరు విమానాశ్రయంలో వారికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో ప్రయాణికులు వారిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టారు.
గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది లగేజీని ఎయిర్ లైన్స్ సిబ్బంది అక్కడే వదిలేశారు. దీంతో విమానం యథావిధిగా బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడ లగేజీ ఏదని ప్రయాణికులు ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బెంగళూరు ఎయిర్ పోర్టులో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రయాణికుల లగేజీ గన్నవరంలో మిస్ అయిందని, త్వరలోనే దాన్ని వారికి అందిస్తామని చివరికి వారు సర్దిచెప్పారు.

గన్నవరం నుంచి బెంగళూరుకు విమానం చేరుకున్న తర్వాత లగేజీ మిస్సయిందనే విషయాన్ని గుర్తించిన ఎయిర్ ఇండియా సిబ్బంది కంగారు పడ్డారు. చివరికి ప్రయాణికులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. తర్వాతి ఫ్లైట్ లో వారికి లగేజీ తెప్పించి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎయిర్ లైన్స్ కు ఫిర్యాదులు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications