రాజీనామా చేస్తా: ఊగిపోయిన అక్బర్, రేవంత్కు మళ్లీ...
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం నాడు శాసన సభలో ఊగిపోయారు. ఉద్యోగాల కల్పన పైన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభలో మజ్లిస్ పార్టీ కోరగా.. 344 కింద నోటీసు ఇచ్చిన సభ్యులే మాట్లాడాలని సభాపతి మధుసూదనాచారి చెప్పారు.
దీంతో అక్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ పైన అందరితో ఎలా మాట్లాడించారని ప్రశ్నించారు. నోటీసు ఇచ్చిన వారే మాట్లాడాలని బీఏసీలో నిర్ణయించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దీంతో అక్బర్ భగ్గుమన్నారు. బీఏసీలో నిర్ణయించింది నిజమైతే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు.

సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడకుండా అడ్డుకునే క్రమంలో మమ్మల్ని కూడా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ తాము సభ నుండి వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం హయాంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయన్నారు.
భూముల కేటాయింపుపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. డీఎల్ఎఫ్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో కేటాయింపులు జరిగాయని, తమకేం సంబంధం లేదని ప్రభుత్వం అనడం సబబు కాదన్నారు. కేటాయింపు న్యాయబద్ధంగా జరగలేదన్నారు. దీని పైన ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. సభా నాయకుడికి ఓపిక, సహనం, హుందాతనం ఉండాలన్నారు.
దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. తాము మంచి చెబితే స్వీకరిస్తామన్నారు. సహనం, ఓపిక ఉందన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు ఉపక్రమించగా.. తెరాస సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభాపతి సభను అరగంట పాటు వాయిదా వేశారు. కాగా, నిజాలు బయటపడతాయని రేవంత్ రెడ్డిని సభలో ప్రభుత్వం మాట్లాడనివ్వలేదని టీడీపీ నేతలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications