జగన్లా కాదు, అడుక్కు తినేవాళ్లం కాదు: లోకేష్, 'మోడీ! మాతో కాపురం చేస్తూ జగన్తో మాటలా'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ మంగళవారం పరోక్షంగా, ప్రత్యక్షంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన వారికి తెలుగు వాడి పౌరుషం చూపే సమయం వచ్చిందన్నారు. పార్లమెంటు, గత ఎన్నికల సమయంలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము అడుగుతున్నామన్నారు.

తెలుగోడి ఆత్మగౌరవం దెబ్బతీసేలా వైసీపీ
ఏపీకి న్యాయం కోసం టీడీపీ ప్రధాని మోడీని నిలదీస్తోందని లోకేష్ అన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తెలుగోడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగువాళ్లు అడుక్కు తినేవాళ్లు కాదని తెలుసుకోవాలి
తెలుగువాళ్లు అడుక్కు తినేవాళ్లు కాదనే విషయాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు. ఇదే సమయంలో ఆయన తనపై వచ్చిన అవినీతి ఆరోపణల పైనా స్పందించారు.

సీఎంల కొడుకులు అందరూ జగన్లా ఉంటారా?
ముఖ్యమంత్రి కొడుకులు అందరూ జగన్లా ఉంటారా అని లోకేష్ ప్రశ్నించారు. సీఎం కొడుకుగా జగన్ అవినీతికి పాల్పడ్డారని, తాను అలా కాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. వైసీపీ, జనసేన అధినేత పవన్ ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎర్రచనందనం రవాణాకు తాను సహకరిస్తున్నానని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, అది సరికాదని, ఆధారాలు ఉంటే చూపించాలని నిలదీశారు.

హోదా కోసం టీ అమ్మిన ఎమ్మెల్యే
ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ ఏలూరు కలపర్రు టోల్ గేటు వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయన టీ తయారు చేసి అమ్మారు. హైవేపై ఇదంతా జరగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఏపీకి హోదా ఇస్తానని చెప్పిన ప్రధాని మోడీ మాట తప్పారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే తమను బయటకు పంపించి వైసీపీని చేరదీసుకోవాలని, తమతో కాపురం చేస్తూనే వాళ్లతో మాట్లాడారని, దానిని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తమకు అధికారం ముఖ్యం కాదని, ప్రజల మనోభావాలు ముఖ్యమన్నారు. పదేళ్లుగా అధికారం లేకపోయనా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ప్రజాస్వామ్యంలో సమస్యల కోసం కృషి చేశారన్నారు.












Click it and Unblock the Notifications