అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఆయనకు సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కేసు పశ్చిమ బెంగాల్ శాసనసభకు సమర్పించిన ఒక తీర్మానంలో జరిగిన అవకతవకల ఆరోపణల నుండి మొదలైంది. ప్రతిపక్ష నాయకుడిగా శోభందేబ్ ఛటోపాధ్యాయ్, ఉప ప్రతిపక్ష నాయకులుగా అసిమా పాత్రా, నయనా బంద్యోపాధ్యాయ్, చీఫ్ విప్గా ఫిర్హాద్ హకీమ్లను నియమించేందుకు సంబంధించిన తీర్మానం ఇది. దీనిపై మే 6న నిర్వహించిన సమావేశంలో తాము సంతకాలు చేయలేదని ముగ్గురు శాసనసభ్యులు స్పష్టం చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఆ సంతకాలు తమవి కావని స్పష్టం చేశారని పేర్కొన్నారు.

మే 9న తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఆఫీస్ బేరర్ల నియామకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్లు అభిషేక్ బెనర్జీ శాసనసభ స్పీకర్కు తెలియజేశారు. తదనంతరం 18న శాసనసభ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఓ లేఖ రాశారు. శాసన సభాపక్ష సమావేశం మినిట్స్, అందులో చేసిన తీర్మానాలు, హాజరైన ఎమ్మెల్యేల సంతకాలను సమర్పించాల్సిందిగా కోరారు.
దీంతో మే 20న అభిషేక్ బెనర్జీ మినిట్స్ ను అందజేశారు. మే 6న నిర్వహించిన సమావేశానికి 70 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు పేర్కొన్నారు. వారి సంతకాల జాబితా కూడా ఇందులో ఉంది. 27న ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నాయకుడి ఎంపికకు సంబంధించి ఎటువంటి తీర్మానం ఆమోదం పొందలేదని, తాము 19 నాటి మినిట్స్ బుక్ లో మాత్రమే సంతకం చేశామని స్పష్టం చేశారు. మే 6 నాటి తీర్మానం కల్పితమైనదని పేర్కొన్నారు. అందులో 14 సంతకాలు బ్లాక్ లెటర్స్లో ఉండటం దీన్ని బలపరిచింది.
ఈ వ్యవహారంపై స్పీకర్ విచారణకు ఆదేశించారు. పోలీసులు ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఈ దర్యాప్తులో.. బ్లాక్ లెటర్స్లో సంతకాలు చేసినట్లుగా భావిస్తోన్న 13 మంది ఎమ్మెల్యేల వాంగ్మూలాలను తాజాగా సీఐడీ నమోదు చేసింది. క్యాండింగ్ పూర్బా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోల్కతాలో జరిగిన సమావేశానికి తాను హాజరుకాలేదని స్పష్టం చేశారు. దీంతో మినిట్స్ బుక్ తో తీసుకుని విచారణకు హాజరు కావాలని అభిషేక్ బెనర్జీకి సీఐడీ నోటీసు జారీ చేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు ఆధారంగా హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్ 27న వారిపై ఛీటింగ్, ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.












Click it and Unblock the Notifications