టీడీపీ, బీజేపీ, జనసేన కలిసికట్టుగా, అమరావతి వేదికగా - ముహూర్తం ఖరారు..!!
ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నిర్ణయం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ మూడు పార్టీలు కలిసి ఒకే వేదిక మీదకు వస్తున్నాయి. ఇందుకు మూహర్తం ఖరారైది. ఈ మూడు పార్టీల పొత్తు చర్చల వేళ..ఈ కలయిక పైన ఆసక్తి కనిపిస్తోంది. ఇందుకు అమరావతి వేదిక కానుంది.
అమరావతి కేంద్రంగా : వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు రాజధానుల వ్యవహారం తెర మీదకు వచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సమయం నుంచి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో నిరసనలు మొదలయ్యాయి.

పలు యాత్రలు చేసారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తిరుమల వరకు పాదయాత్ర చేసారు. ఆ తరువాత అరసవల్లి వరకు మరో యాత్ర ప్రారంభించినా పూర్తి కాలేదు. వైసీపీ మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉండగా...అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతికి అనుకూలంగా నిలిచాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.
సభలో ప్రతిపక్ష పార్టీలు : జూలై 11న సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. సెప్టెంబర్ నుంచి విశాఖలో పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే అమరావతి ఉద్యమం ప్రారంభమై ఈ నెల 9వ తేదీకి 1300వ రోజుకు చేరుతుంది. ఈ సమయంలో రాజధాని ఐకాస నాయకత్వంలో మందడంలో సభ ఏర్పాటు చేసారు.
ఈ సభకు టీడీపీ, జనసే, బీజేపీ, వామపక్షాలతో పాటుగా కాంగ్రెస్, ప్రజా సంఘాలను ఆహ్వానించారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మరోసారి పొత్తు వ్యవహారం రాజకీయంగా చర్చ సాగుతోంది. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఇప్పటి వరకు ఆహ్వానం లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేది పవన్ అభిమతం. ఈ సమయంలో బీజేపీ నిర్ణయం కీలకం కానుంది.

పొత్తుల చర్చల వేళ కీలకంగా : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు. అమరావతికి బీజేపీ మద్దతుగా ఉంది. టీడీపీ, జనసేన ఇప్పటికే మద్దతు ప్రకటించారు. గతంలో తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభలోనూ చంద్రబాబు..నాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా పాల్గొన్నారు.
ఇప్పుడు ఇంకా అధ్యక్ష బాధ్యతలు చేపట్టకపోవటంతో పురందేశ్వరి హాజరయ్యే అవకాశం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ నుంచి నేతలు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారని అమరావతి జేఏసీ నేతలు చెబుతున్నారు.వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాల వేళ అమరావతిలో ఈ మూడు పార్టీలు ఒకే వేదిక పైకి రావటం.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో పాల్గొనటం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications