విజయవాడలో చిరు వ్యాపారులకు పోలీసుల షాకులు..! రోడ్డుపై కనిపిస్తే..!
విజయవాడ(Vijayawada)లో ఈ మధ్య కాలంలో రోడ్లపై కనిపించే చిరువ్యాపారుల (Hawkers)సంఖ్య తగ్గిపోతోంది. అభివృద్ధి పేరుతో రోడ్లపై ఆంక్షలతో చిరువ్యాపారులను, వారి వ్యాపారాలను అక్కడి నుంచి తొలగించేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు వరుస డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. దీంతో నగరం లోని పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పోలీసులు హాకర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్తుంటే.. వ్యాపారులు మాత్రం ఉపాధి కరవై అల్లాడిపోతున్నారు.
తాజాగా బీసెంట్ రోడ్డుపై దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకున్న చిరు వ్యాపారుల్ని ఈ మధ్య షాపుల యజమానులంతా కలిసి కోర్టుకు వెళ్ళి మరీ తొలగింపు ఉత్తర్వులు తీసుకొచ్చారు. దీంతో పాటు పోలీసులు (Vijayawada Police)కూడా కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. దీంతో వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పంపేశారు. దీంతో ఇప్పుడు బీసెంట్ రోడ్డు ఖాళీగా కనిపిస్తోంది. అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వ్యాపారులు బీసెంట్ రోడ్డు స్ధాయిలో తమకు వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఇవాళ వన్ టౌన్ కాళేశ్వర రావు మార్కెట్ దగ్గర నుండి శివాలయం వీధి, భావన్నారాయణ వీధి వరకు, అలాగే కాళేశ్వర రావు మార్కెట్ వద్ద రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారంటూ పలువురు వ్యాపారుల్ని పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారికి కేటాయించిన హద్దులు దాటి వచ్చిన దుకాణాలను, తోపుడుబండ్లను లోపలికి జరిపించారు. మార్కెట్ కు చాలా దూరం నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారం నిర్వహించుకోవాలని సూచించారు. దీన్ని టాక్టికల్ అర్బనిజంగా పోలీసులు చెప్తున్నారు. కానీ చిరు వ్యాపారులు మాత్రం పోలీసుల ఆంక్షలతో వ్యాపారాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు.













Click it and Unblock the Notifications