జనసేనలోకి కాంగ్రెస్ ముఖ్య నేత, అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ రాజధాని పైన వచ్చే ఎన్నికల్లో తన విధానం ఏంటో ఇప్పటికే స్పష్టం చేసారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ తన పార్టీ బలోపేతం దిశగా కసరత్తు చేస్తున్నారు. కొత్త కమిటీలు ఏర్పాటు చేసారు. కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. అయితే, అక్కడే కీలక అంశం తెర మీదకు వస్తోంది.
ఏపీలో 2029 ఎన్నికలే లక్ష్యంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. పార్టీల మార్పులు - చేర్పు ల పైనా చర్చలు జరుగుతున్నాయి. కొందరు నేతలు ఏ పార్టీలో చేరాలో డిసైడ్ అవుతున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనలోకి వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జనసేనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

చీరాల నుంచి రెండుసార్లు గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ మరోసారి మాత్రం గెలుపు దక్కలేదు. 2009, 2014 ఎన్నికల్లో చీరాల నియోజకర్గం నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. తర్వాత మాత్రం కాంగ్రెస్ లో చేరినా ఆయనకు విజయం దక్కలేదు. అయితే, 2024లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ లో తనకు ఇక రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.
సీటు పైన సమాలోచనలు.. తుది నిర్ణయం..?
కాగా, ఇప్పటికే తన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో ఉండటంతో పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. చీరాల నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రకాశం జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అది తనకు కలసి వస్తుందని ఆమంచి కృష్ణమోహన్ భావిస్తున్నారు. తనకున్న సొంత బలంతో పాటు పవన్ కల్యాణ్ చరిష్మా కూడా తోడయితే గెలుపు ఖాయమని ఆమంచి కృష్ణమోహన్ అంచనాతో ఉన్నారు.
అయితే.. చీరాల నుంచి టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. పొత్తుల లెక్క ల్లో భాగంగా చీరాల జనసేనకు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. సీటు పైన హామీ వస్తేనే పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ సైతం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీలో రీ ఎంట్రీ పైనా ప్రచారం సాగింది. ఇప్పుడు జనసేన లో చేరుతున్నారనే వాదన వేళ.. ఆమంచి తుది నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications