సింగపూర్ కంటే పదిరెట్లు, చెన్నై కంటే 6రెట్లు: 'అమరావతి' బాబుకు సవాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలని ఉవ్వీళ్లూరుతున్నారు. అమరావతి నిర్మాణం చంద్రబాబుకు అతి పెద్ద సవాల్ అని చెప్పవచ్చు.
నూతన రాజధాని కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల నుంచి 33వేల ఎకరాలను సేకరించారు. నూతన రాజధాని 7,420 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది సింగపూర్కు పది రెట్లు, అలాగే తమిళనాడు రాజధాని చెన్నైకు దాదాపు ఆరురెట్లు పెద్దది.
సింగపూర్ ప్రభుత్వం అమరావతి రాజధానికి అత్యాధునిక మాస్టర్ ప్లాన్ అందించింది. స్వతంత్ర భారత దేశంలో అమరావతి అయిదో ప్రణాళికా రాజధాని (ప్లాన్డ్ కాపిటల్).
స్వతంత్ర భారతంలో గాంధీ నగర్, చండీగఢ్, భువనేశ్వర్, నయా రాయపూర్ తర్వాత... కొత్తగా నిర్మితమవుతున్న, ప్రణాళిక రాజధాని అమరావతి.
కాగా, అమరావతిని రాజధానిగా చేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. విదేశాల్లో మార్కెటింగ్ తదితరాల కోసం అమరావతి పేరును ఎంచుకున్నారనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అమరావతికి చారిత్రకంగా ఎంతో పేరు ఉంది.