శాలరీ అడిగిన బాబు, రాజధాని మాస్టర్ప్లాన్(పిక్చర్స్)
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో అందరు పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజ్ఞప్తి చేశారు. ఏపీ సచివాలయం నుంచి చంద్రబాబు కలెక్టర్లతో మాట్లాడారు. నూతన రాజధాని నిర్మాణానికి ఉద్యోగులు ఒకరోజు వేతనం ఇవ్వాలని కోరారు.
కాగా, రానున్న రోజుల్లో రెండు కోట్ల జనాభా అవసరాలకు తగ్గట్టు రాజధాని అమరావతిని తీర్చిదిద్దేలా సింగపూర్ ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ ప్లాన్ను రూపొందించింది. ఈ ప్రణాళిక ముసాయిదాకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రణాళికలోని కీలక అంశాలను వెల్లడించింది. రాజధాని ప్రాంతంలో ప్రస్తుత జనాభా 5.8 మిలియన్లు ఉంది. 2050 నాటికి 20 మిలియన్లకు పెరగనుంది.
క్యాపిటల్ రీజియన్లో గ్రామాలను 8 పట్టణాలుగా అభివృద్ధి చేస్తారు. ప్రతి పట్టణంలో ఒక అభివృద్ధి సెంటర్ ఏర్పాటు చేస్తారు. గన్నవరం ఎయిర్పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేస్తారు. రాజధాని సమీపంలో మంగళగిరిలో 5 వేల ఎకరాల రిజర్వు ఫారెస్టులో విమానాశ్రయం నిర్మిస్తారు.
నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం పోర్టును లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతారు. వచ్చే ఓడరేవు, నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ - వాన్పిక్గా అభివృద్ధి చేస్తారు. రీజనల్ సెంటర్లు కనెక్ట్ చేస్తూ రీజియన్ ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తారు. తాత్కాలిక అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయంగా సిటీ రిలీఫ్ రోడ్లు ఏర్పాటు చేస్తారు.
రోడ్డు మార్గాల లింక్
రీజియన్ సెంటర్లలో ఇంటిగ్రేటెడ్ రెజినల్ హబ్లు నిర్మిస్తారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కృష్ణానది చుట్టూ పెరగనున్న రోడ్డు మార్గాల లింక్ను కలుపుతారు.
మెట్రో రైలు
ప్రస్తుతం 58 లక్షల జనాభాతో కొత్తరాజధాని ప్రాంతం ఉంటుందని (అమరావతి- విజయవాడ- గుంటూరు- తెనాలి- మంగళగిరి), 2030కి జనాభా ఒక కోటి 10 లక్షలకు, 2050కి రెండుకోట్లకు చేరుతుందని అంచనా వేశామన్నారు.
అభివృద్ధి కారిడార్లు
హైదరాబాద్- మచిలీపట్నంను అభివృద్ధి కారిడార్గా మారుస్తారు. నందిగామ కారిడార్లో ఫార్మా, బయోటెక్, ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. గుడివాడ కారిడార్లో గ్రీన్ ఇండస్ట్రీస్, వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతారు. వైజాగ్ చెన్నై కారిడార్లో సముద్ర ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతారు.
అభివృద్ధి కారిడార్లు
గన్నవరం కారిడార్లో ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ పరిశ్రమలు నెలకొల్పుతారు. గుంటూరు కారిడార్లో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ చెయిన్స్, టెక్స్టైల్స్, నాన్ మెటాలిక్ ప్రొడక్ట్ల పరిశ్రమలు నెలకొల్పుతారు. తెనాలి పరిసరాల్లో లాజిస్టిక్స్, టూరిజం రంగాలను ప్రోత్సహిస్తారు. సత్తెనపల్లిలో టూరిజం, నాలెడ్జి సెంటర్, నూజివీడులో ఆగ్రో పరిశ్రమలు, ఫ్యాబ్రికేషన్ హబ్గా చేస్తారు.
పారిశ్రామిక క్లస్టర్లు
ప్రస్తుతం అక్కడ ఉన్న పరిశ్రమలను ఆధారంగా చేసుకుని ఎకనామిక్ క్లస్టర్లను ప్రతిపాదించడం జరిగింది. విజయవాడ క్యాపిటల్ సిటీ పరిధిలో బిజినెస్ ట్రేడింగ్ హబ్, ఆగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటు చేస్తారు. అమరావతిలో టూరిజం, పర్యాటక, సాంస్కృతిక కేంద్రాలు, గుంటూరులో అగ్రికల్చర్ ట్రేడింగ్, గుడివాడలో లాజిస్టిక్ పార్కు, గన్నవరంలో వాల్యూ యాడెడ్ ఎకనామిక్ హబ్, ఎఫ్టిజడ్, ఎస్ఇజడ్, టెక్స్టైల్, ఏరోస్పేస్, ఐటి క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు.
హైస్పీడ్ రైళ్లు
జాతీయ హైస్పీడ్ రైలును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. విజయవాడ మీదుగా వైజాగ్- చెన్నైలను కలుపుతూ ఈ రైలు నడుపుతారు. అలాగే హైదరాబాద్కు హైస్పీడ్ రైలు నడుపుతారు. బెంగళూరుకు మరో హైస్పీడ్ రైలు నడుపుతారు. సముద్రతీరాన్ని కనెక్ట్ చేస్తూ డెడికేటెడ్ ఫ్రయిట్ కారిడార్ను ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ నుండి నూజివీడు మీదుగా విజయవాడకు డెడికేటెడ్ ఫ్రయిట్ కారిడార్ను ప్రతిపాదిస్తున్నారు. మెట్రో రైలు వస్తుందన్నారు.
జలమార్గం
కృష్ణానది ఉత్తర, దక్షిణ దశలను కనెక్ట్ చేస్తూ బకింగ్ హామ్ కెనాల్ జలమార్గం పునరుద్ధరిస్తారు. ప్రకాశం బ్యారేజీ దిగువకు జలమార్గాన్ని నిర్మిస్తారు. విజయవాడ తెనాలి కేంద్రాలుగా వాటర్ లాజిస్టిక్ హబ్ నిర్మిస్తారు.
సింగపూర్ సాయంతో
దేశంలో నయారాయపూర్ను ప్రత్యేకంగా నిర్మించారని, తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా నిర్మించుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా అమరావతి నగర నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందన్నారు. క్యాపిటల్ రీజియన్కు సంబంధించి ఒక ప్రణాళిక, క్యాపిటల్ సిటీకి సంబంధించి మరో ప్రణాళిక, సీడ్ క్యాపిటల్ డిటైల్స్ను మూడోఅంశంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించామన్నారు.