అమరావతి రైతు దీక్షలకు 150 రోజులు: జయహో అంటోన్న నారా లోకేష్: జగన్కు సలహా
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను నిరసనగా రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన దీక్ష 150వ రోజుకు చేరుకుంది. ఒకవంక కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ.. దాన్ని నిరోధించడానికి లాక్డౌన్ను అమల్లోకి తీసుకుని వచ్చినప్పటికీ.. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఈ దీక్షలకు అడ్డుకట్ట పడలేదు. అమరావతి ప్రాంత రైతులు తమ ఇళ్ల ముందే కూర్చుని ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. నిరసనను కొనసాగిస్తున్నారు. కొవ్వొత్తులతో తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నారు.
ఇంగ్లీష్ మీడియం: వెనక్కి తగ్గని సుధీష్ రాంభొట్ల: ఈ సారి సుప్రీంకోర్టుకు: కొత్త జీవోపైనా రగడ
మూడు రాజధానుల ప్రకటనతో..
అమరావతి సహా విశాఖపట్నం, కర్నూలు నగరాలను రాజధానులు మార్చబోతున్నట్లు గత ఏడాది అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన.. వారి పోరాటానికి కారణమైంది. అమరావతి చట్టసభల రాజధానిగా, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తామని వైఎస్ జగన్ నిండుసభలో ప్రకటించారు. అమరావతిలో శాసనసభ, శాసన మండలిని కొనసాగిస్తూనే.. విశాఖలో సచివాలయాన్ని, కర్నూలులో శాశ్వత హైకోర్టును నెలకొల్పతామని చెప్పారు.
వైసీపీయేతర పార్టీలన్నీ ఏకం..
ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ ప్రకటన వెలువడగానే తెలుగుదేశం పార్టీ నాయకులు భగ్గుమన్నారు. రాజధాని నిర్మాణానికి ఉదారంగా భూములను ఇచ్చిన రైతుల గొంతు కోస్తోందని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు సారథ్యాన్ని వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు సైతం అదే బాటలో నడిచారు. వందరోజులకు పైగా ఈ ఆందోళనలు కొనసాగాయి. రాజధాని అమరావతి ప్రాంతం పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, నెక్కల్లు, ఉండవల్లి వంటి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు.
ఈ రెండూ హైలైట్స్..
రోజుల తరబడి నిరసన శిబిరాలను కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావాన్ని ప్రకటించాయి. రైతులతో పాటు ఆయా పార్టీ నాయకులు కూడా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంత రైతుల కోసం జోలె పట్టుకుని భిక్షాటన చేయడం, ఆయన భార్య భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ప్రకటించడం ఈ 150 రోజుల ఆందోళనల్లో హైలైట్గా చెప్పుకోవచ్చు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మరీ భిక్షాటన చేశారు.
కరోనా వైరస్ ప్రభావం వల్ల
రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నప్పటికీ.. వారు లెక్క చేయలేదు. పొరుగు రాష్ట్రల్లో కరోనా వైరస్ విస్తరించినప్పటికీ లెక్క చేయలేదు. వెనకడుగు వేయలేదు. నిరసన దీక్షా శిబిరాలను కొనసాగించారు. ఇలాంటి పరిణామాల మధ్య రైతుల ఆందోళనలు 150వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నాయకులు రైతుల పట్టుదలను ప్రశంసిస్తున్నారు. జై అమరావతి ఉద్యమం నేటితో 150 రోజులకు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రైతుల పోరాటాన్ని కొనియాడారు.
భేషజాలకు పోకుండా అమరావతిలోనే కొనసాగించాలి..
రైతులు చేపట్టిన ఈ నిరసనలు 150వ రోజుకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి ప్రాంత రైతులకు కృతజ్ఙతలను తెలియజేస్తున్నారు. పోలీసు బలగాలతో అమరావతి రైతులను అణచివేసిన ప్రతీసారీ రెట్టించిన ఉత్సాహంతో వారు ఈ పోరాటంలో పాల్గొన్నారని ప్రశంసిస్తున్నారు. వారి తెగువను కొనియాడుతున్నారు. లాఠీ దెబ్బలు, అక్రమ కేసులతో జై అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం అడ్డదారులు తొక్కిందని, అయినా రైతులు సహనం కోల్పోలేదని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అణచివేయాలనుకున్న ప్రతిసారీ జై అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని చెప్పారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా అమరావతిలోనే రాజధానిని కొనసాగించేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.