చిరంజీవికి అమరావతి సెగ: ఇంటి వద్ద నిరాహార దీక్షకు జేఏసీ ప్లాన్
అమరావతి: కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవికి అమరావతి సెగ తగలబోతోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి ప్రాంతం నుంచి సచివాలయం, హైకోర్టులను తరలించడంపై చిరంజీవి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున నిరాహార దీక్షకు దిగబోతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఐక్యకార్యాచరణ కమిటీ దీనికి సారథ్యాన్ని వహించనుంది.
Recommended Video
క్రియాశీలక రాజకీయాల్లో లేనప్పటికీ..
ప్రస్తుతం చిరంజీవి క్రియాశీలక రాజకీయాల్లో లేరు. రాజకీయాల నుంచి తప్పుకొని చాలా కాలమైంది. మళ్లీ సినిమాల వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం 152వ మూవీ కోసం కసరత్తు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వాన్ని వహిస్తోన్న ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత.. కేంద్రమంత్రిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు.
రాజకీయాలపై ఆసక్తి లేని చిరు..
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చిరంజీవి ఏ మాత్రం దృష్టి సారించట్లేదు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం పట్ల గానీ, ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ తీరు, తీసుకుంటున్న నిర్ణయాలపై గానీ విమర్శించడానికో లేదా ప్రశంసించడానికో చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపిన సందర్భాలు కూడా లేవు. రాష్టంలో మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని కూడా ఆయన రాజకీయ కోణంలో చూల్లేదు. ఇదివరకు ఓ సారి ముఖ్యమంత్రిని కలిసినప్పటికీ.. అది తన సైరా సినిమా ప్రమోషన్ కోసమేననే విషయం తెలిసిందే.
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై చిరంజీవి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి ప్రాంత రైతులు. మూడు రాజధానుల ఏర్పాటును నిరసించాలని, అమరావతిని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలంటూ అమరావతి ప్రాంత రైతులు పట్టుబడుతున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు.
రాజ్యసభకు పంపించే అవకాశం ఉండటం వల్లేనా..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చిరంజీవిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందంటూ కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు రాజకీయంగా చెక్ పెట్టడానికి వైఎస్ జగన్.. వ్యూహాత్మకంగా చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు ఆయనను టార్గెట్ చేసి ఉండొచ్చని అంటున్నారు.