అమరావతి భూ కుంభకోణంపై సీబీఐతో విచారణకు జగన్ సర్కార్ సై: ఏప్రిల్ 7న సుప్రీంలో
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో చోటు చేసుకున్న భూ కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ సర్కార్ భావిస్తోందా? అందులో భాగంగానే ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేశారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అమరావతి భూ కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సిట్ చేపట్టిన విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

స్టే ఎత్తేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్..
ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణపై ఏపీ హైకోర్టు స్టే జారీ చేయడానికి జగన్ సర్కార్.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. స్టేను తొలగించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వారం రోజుల కిందటే ప్రభుత్వ వివరణ సైతం కోరింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తిన కొన్ని అభ్యంతరాలకు వివరణ ఇచ్చింది. విచారణ పేరుతో బలవంతపు చర్యలు ఉండబోవని తెలిపింది. న్యాయస్థానం పర్యవేక్షణలోనే విచారణ కొనసాగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో సీబీఐతో దర్యాప్తు చేయించడానికి కూడా అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీం ధర్మాసనానికి వెల్లడించింది.

7న విచారణ..
ప్రభుత్వ వివరణను తీసుకున్న తరువాత జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును వచ్చేనెల 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈలోగా ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. చంద్రబాబుకు నోటీసులను జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సూచించారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసు వ్యవహారంలో జగన్ సర్కార్.. అనూహ్యంగా సీఐడీని రంగంలోకి దింపడం వెనుక కారణం ఏమై ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.

సీబీఐకి వైపు మొగ్గు..
అమరావతి భూ కుంభకోణం విచారణను సీబీఐకి అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది రాజీవ్ ధవన్ వివరించారు. ఇదే ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది. సీబీఐకి అప్పగించడంలో భాగంగానే.. తొలుత సీఐడీతో నోటీసులను ఇప్పించి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్ర రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకే అప్పగించడానికి జగన్ సర్కార్ మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు సైతం వినిపిస్తోన్నాయి. సీబీఐకి అప్పగించడం వల్ల విచారణకు అడ్డంకులు ఉండబోవని భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications