చంద్రబాబును డెఫినెట్గా లోపలేస్తారు: వారిదంతా ఒకటే కులసంఘం: ఖర్జూర రాజ్యాంగం: కొడాలి నాని
అమరావతి: అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని కుండబద్దలు కొట్టారు. దళితులను భూములను కొట్టేసి.. తన బినామీలు, అగ్రవర్ణ నాయకులకు కట్టబెట్టిన చంద్రబాబు దుర్మార్గపు నాయకుడంటూ విమర్శించారు. విచారణను ఎదుర్కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.
సీఆర్డీఏ ఛైర్మన్గా ఉన్నది చంద్రబాబే..
అమరావతి భూముల కుంభకోణంలో సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులను జారీ చేయడం పట్ల ఆయన స్పందించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) ఛైర్మన్గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే పని చేశారని గుర్తు చేశారు. 33 వేల ఎకరాల మేర భూ సమీకరణ చంద్రబాబు సారథ్యంలోనే సాగిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన భూములను సైతం వదలకుండా సమీకరించారని చెప్పారు. ప్రభుత్వం ఏ దళితులకైతే అసైన్డ్ భూములను ఇచ్చిందో.. భూమిని సమీకరించిన తరువాత వాళ్లకు మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని, ఆ భూమికి దళితులే హక్కుదారులని అన్నారు.
అసైన్డ్ చట్టం ఉల్లంఘన..
ఈ మేరకు అసైన్డ్ చట్టంలో క్లాజులు ఉన్నాయని గుర్తు చేశారు. అసైన్డ్ భూములను రద్దు చేయాల్సి వస్తే.. అవి ప్రభుత్వానికే చెందుతాయి తప్ప అగ్రవర్ణాలకు దక్కదని అన్నారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. అసైన్డ్ భూములనేవి ప్రభుత్వ ఆస్తి అయినందున, కొన్ని అనివార్య పరిస్థితుల మధ్య వాటిని ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాల్సి వస్తే.. హక్కుదారులైన దళితులకే నష్ట పరిహారం చెల్లించేలా అసైన్డ్ చట్టం చేశారని కొడాలి నాని అన్నారు. దీనికి భిన్నంగా అతి తక్కువ రేటు చెల్లించి, దళితుల నుంచి చంద్రబాబు చుట్టూ ఉన్న కొందరు నాయకులు వాటిని కొనుగోలు చేశారని అన్నారు.
ఆ తరువాతే జీవో..
చంద్రబాబు బినామీలు అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన తరువాతే.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి ఉచితంగా 800 గజాలను ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవోను జారీ చేసిందని కొడాలి నాని అన్నారు. ఆ భూమిని అగ్రవర్ణ పేదలకు ఇచ్చారని, ఇది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కిందికే వస్తుందని అన్నారు. దళితుల ఆస్తులను పరిరక్షణలో విఫలమైనా, దాన్ని కాజేసినా కూడా అట్రాసిటీ కేసు వర్తిస్తుందని చెప్పారు. దీనిపై తమ ప్రభుత్వ హయాంలో ఇదివరకు విచారణ కొనసాగిందని, ప్రభుత్వం వద్ద సమగ్ర నివేదిక ఉందని అన్నారు.
ఖర్జూర నాయుడి రాజ్యాంగంలో రాశారా?
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏవైనా.. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదంటూ.. మినహాయింపు ఏమైనా ఇచ్చారా? అంటూ కొడాలి నాని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో ఖర్జూర నాయుడు రాజ్యాంగాన్ని అమలు చేయవచ్చని చంద్రబాబును ఆయనేమైనా అనుమతి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ కేసులో చంద్రబాబు ముద్దాయేనని స్పష్టం చేశారు. 500 కోట్ల రూపాయల దళితుల ఆస్తిని చంద్రబాబు అగ్రవర్ణాలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయని, చంద్రబాబు, పవన్ కల్యాణ్, సీపీఐ నారాయణను వేరు చేసి చూసే పరిస్థితి లేదని, వారిదంతా ఒకటే కులసంఘమని అన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే చదువుతారని మండిపడ్డారు. కుక్కల్లా మొరిగితే ఉపయోగం ఉండదని, మరింత మందికి నోటీసులు జారీ చేస్తారని అన్నారు.