టీ స్పీకర్కు హైకోర్టు తీర్పు, చంద్రబాబుకు చెంపపెట్టు: అంబటి
అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. బుధవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నైతికంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్కు వర్తిస్తుందని ఆయన అన్నారు. హైకోర్టు ఉత్తర్వులను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కూడా నైతికంగా ఉమలు చేయాలని అంబటి పేర్కొన్నారు. ఏపీలో పార్టీ ఫిరాయించిన 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఒక్కటేనని ఆయన అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. తాము కూడా హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని బుధవారం హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్లో టీడీఎల్పీ విలీనంపై హైకోర్టును తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు వెలువరిచింది.
మూడు నెలల్లోగా 12మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. తెలంగాణ టీడీపీ శాసనసభాపక్షం (టీ-టీడీఎల్పీ) టీఆర్ఎస్లో విలీనమైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏడాది మార్చి 10న జారీచేసిన బులెటిన్ అమలును నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.