కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణపై నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం సాయత్రం విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు నివేదిక సమర్పించారు. అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డలు నేరుగా ఒకరిపై ఒకరు విర్శలు చేసుకుంటున్నవేళ ప్రభుత్వ పరంగా సీఎస్ వివరణ ఇచ్చారు. దీనిపై నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది..

ఆల్ పార్టీకి డుమ్మా కొట్టడంతో..
స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ.. గుర్తింపు పొందిన 11 పార్టీల నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు. మెజార్టీ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కోరగా, గతంలో ఖరారైన ఏకగ్రీవాలను రద్దు చేయాలని నేతలు ముక్తకంఠంతో కోరారు. ఈ భేటీకి అధికార వైసీపీ హాజరుకాకపోవడాన్ని గర్హిస్తూ.. ప్రభుత్వ అభిప్రాయం కోసం సీఎస్తో సమావేశం అవుతానని నిమ్మగడ్డ మీడియాకు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సీఎస్ నీలం సాహ్ని ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వం తరఫున నివేదిక సమర్పించారు. అందులో..

కరోనా ఉంది.. కుదరదు..
రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని సీఎస్ నీలం.. ఎస్ఈసీ నిమ్మగడ్డకు తేల్చిచెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ, వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం అందజేస్తామని నీలం పేర్కొన్నారు. ఎస్ఈసీతో భేటీలో సీఎస్ తోపాటు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతేకాదు..

దేశంలోనే బెస్ట్.. కానీ..
‘‘కరోనా నియంత్రణకు సంబంధించి దేశంలోనే అత్యత్తమంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని, దాని ప్రభావ తీవ్రతను నిలువరించగలిగాం. కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అధికారులు, ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. 11వేల మందికిపైగా పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తాం. వాయిదా పడ్డ ఎన్నికల నిర్వహణపై తెలియజేస్తాం'' అని నిమ్మగడ్డకు ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. దీనిపై..

నిమ్మగడ్డ కోర్టులో బంతి..
కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రానందున ఇప్పట్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని జగన్ సర్కారు అధికారికంగా తేల్చేయడంతో బంతి ఎస్ఈసీ నిమ్మగడ్డ కోర్టుకు చేరినట్లయింది. ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలిస్తే అప్పుడే సమాచారం ఇస్తామంటూ సీఎస్ ఇచ్చిన నివేదికపై నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోర్టు సూచనల మేరకు ఎన్నికల ప్రక్రియను పున:ప్రారంభించిన ఆయన.. సర్కారు తాజా స్పందన తర్వాత మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారా? లేక కేంద్ర ఎన్నికల సంఘం సహాయం కోరతారా? అనేది తేలాల్సిఉంది.












Click it and Unblock the Notifications