వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థులపై వర్ల ఫైర్.. లోకేశ్ ఎప్పటికీ రాలేడన్న విజయసాయి..
నిన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్రంగా తగువులాడుకున్న వైసీపీ-టీడీపీ.. శుక్రవారం నాటి రాజ్యసభ ఎన్నికల్లోనూ పరస్పర దూషణలు కొనసాగించాయి. బలం లేకపోయినా, బలహీనుల గొంతుక వినిపించడానికే తాను పోటీకి దిగానన్న టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య.. అధికార పార్టీ తరఫున బరిలో నిలిచినవాళ్లపై అనూహ్య ఆరోపణలు చేశారు. దోపిడీనే తారకమంత్రంగా టీడీపీ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎదురుదాడి చేశారు.

అంతా ఊహించినట్లే..
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాల కోసం శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ బరిలో నిలవగా, టీడీపీ తరపును వర్ల రామయ్య పోటీ చేశారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉండిపోగా, మరో ఇద్దరు అందుబాటులో ఉండికూడా ఓటువేయలేదు. తద్వారా అంతా ఊహించినట్లే ఎలాంటి ఆటంకం లేకుండా వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడనున్నాయి.

ఏ4ను పెద్దల సభకా?
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ వైసీపీ క్యాండేట్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమరణకు నేర చరిత్ర ఉందని, అవినీతి కేసుల్లో ఏ4గా ఉన్న ఆయన, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతాడని, ఇక అయోధ్య రామిరెడ్డిపై దేశ వ్యాప్తంగా 10 కేసులు ఉన్నాయని, మూడో అభ్యర్థి పరిమళ్ నత్వానీకి ఏపీతో సంబంధమేలేదని, రిలయన్స్ అంబానీకి చెందిన నత్వానీకి జగన్ ఎందుకు టికెట్ ఇచ్చాడో అర్థంకావడంలేదని వర్ల దుయ్యబట్టారు.

అదో బిస్కెట్ పార్టీ..
‘‘గౌరవప్రదంగా భావించే పెద్దల సభకు.. వైసీపీ ఇలాంటి వ్యక్తుల్ని ఎంపిక చేయడం సిగ్గుచేటు. మాకు బలం లేదని తెలిసినా.. పేద, బడుగు, బలహీనవర్గాల వాణిని వినిపించాలనే ఉద్దేశంతోనే నేను పోటీకి నిలబడ్డాను. పైగా నాపై ఎలాంటి కేసులు లేవు. ఉన్న సీట్లన్నింటినీ జగన్ ఎవరికి కట్టబెట్టాడో చూస్తే.. దాన్ని బట్టే వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ అని అర్థమైపోతోంది. రెండు సీట్లను బీసీలకు ఇచ్చేబదులు.. ఒక సీటును ఎస్సీలకు ఇస్తే ఏంపోయింది? ఈ వ్యవహారంపై జగన్ ను ప్రశ్నించే సత్తా వైసీపీ ఎస్సీ ఎమ్మెల్యేలకు లేదా?''అని రామయ్య ప్రశ్నించారు.

బాబు చేతిలో అస్తవ్యస్తం..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ వ్యవహరించిన తీరు, దానికి చంద్రబాబు అనుకూల మీడియా చేస్తోన్న ప్రచారంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తన హయాంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా, రిజర్వు బ్యాంకు దగ్గర చేబదుళ్లు (వేస్ అండ్ మీన్స్), ఓవర్ డ్రాఫ్ట్ లతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడని, 2.36 లక్షల కోట్ల రుణాలు తెచ్చి,.. ఆస్తులు పెంచకుండా అందినకాడికి దోచుకున్నాడని, అదే హెరిటేజ్ ఫుడ్స్ లో ఇలాగే చేసారా? అని ఎంపీ దుయ్యబట్టారు. బాబు హయాంలో బడ్జెట్ ఉత్తుత్తి వ్యవహారంగా ఉండేదని, ఇప్పుడు మాత్రం క్షేత్ర స్థాయిలో బడ్జెట్ పత్రానికి ప్రామాణికత వచ్చిందని ఎంపీ అన్నారు.
Recommended Video

లోకేశ్ రాలేడు..
అప్రాప్రియేషన్ బిల్లు సందర్భంగా శాసన మండలిలో చోటుచేసుకున్న గలాటా, మంత్రిపై దాడి, నారా లోకేశ్ వీడియో, ఫొటోల చిత్రీకరణ వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తీరుపై విమర్శలు పెరుగుతోన్న వేళ.. ఆయన జీవితంలో ఎన్నటికీ శాసనసభ గడప తొక్కలేడని వైసీపీ నేత విజయసాయి అన్నారు. ‘‘దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన లోకేశ్ కు క్రమశిక్షణ, సభ విలువలు తెలుస్తాయని ఆశించడం అత్యాశే. ఆఖరి సమావేశం అనుకున్నాడేమో.. మంత్రుల పైకి ఎమెల్సీలను ఉసిగొల్పి, వీడియోలు తీసి ఎల్లోమీడియాకు పంపించాడు. ఒకటి మాత్రం నిజం చిట్టినాయుడు.. శాసనసభలోకి ఎప్పటికీ అడుగుపెట్టలేవు''అని రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications