సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన తీర్పు ద్వారా.. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోందని స్పష్టంగా వెల్లడైందని, జగన్ పాలనలో గడిచిన 19 నెలలుగా ఏపీలో అరాచకం కొనసాగుతోందని, వరుస రాజ్యాంగ ఉల్లంఘనలపై ఇక నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర గవర్నరే అని ప్రతిపక్ష టీడీపీ నేతలు అన్నారు..
Recommended Video
నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ
గవర్నర్తో టీడీపీ టీమ్ భేటీ
పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ప్రతిపక్ష టీడీపీ నేతల బృందం సోమవారం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. సుప్రీం వ్యాఖ్యలతో ఏపీలో రాజ్యాంగ విలువలు పతనమైనట్లు తేలిపోయిందని, గడిచిన 19 నెలలుగా ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని, మొత్తంగా జగన్ సర్కారుపై తక్షణమే చర్యలు తీసుకుని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ దే అని టీడీపీ నేతలు చెప్పారు. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతల్లో వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్రావు, బుద్దా వెంకన్న, మంతెన సత్యనారాయణరాజు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తదితరులున్నారు.
సుప్రీం ఏం చెప్పిందంటే..
ఏపీ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తూ, ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. తీర్పు సందర్భంగా అసాధారణ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించబోమని, కరోనా వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని, ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని, ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బెంచ్ 'రాజ్యాంగ విచ్ఛిన్నం' అనే పదాన్ని వాడటం గర్హనీయమని ప్రతిపక్ష టీడీపీ నేతలు అంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అహంకారపు పొరలు తొలగాలి..
''ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా సీఎం జగన్ కళ్లకు పేరుకుపోయిన అహంకారపు పొరలు తొలగిపోవాలి. నాకు 151 సీట్లు ఉన్నాయికదా, ఏదైనా చేస్తాననుకుంటే చెల్లదని తెలుసుకోవాలి. ఉద్యోగ సంఘాల వెనుక ఉన్నది ఎవరో, వాళ్లతో అనుచితంగా మాట్లాడించింది ఎవరో అందరికీ తెలుసు. కోర్టు తీర్పును ప్రభుత్వాలు పాటించాలని రిక్షావాళ్లకు కూడా తెలుసు. కేవలం అహంకారంతోనే జగన్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం ప్రస్తావించింది. మీడియాపై, విమర్శకులపై వైసీపీ సర్కారు దమనకాండకు దిగింది. గడిచిన 19 నెలలుగా ఏపీలో అరాచక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అనుసరించారు. వ్యవస్థల్నీ, రాజ్యాంగాన్ని కాదని ఇష్టారీతిగా వ్యవహరించడానికి ఇదేమైనా ఫ్యాక్షనిజమా? ప్రజాస్వామ్యమా? వీటన్నింటిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలి. ఆ మేరకే మేం మెమోరండం ఇచ్చాం'' అని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. గవర్నర్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇక..
పాటించండి.. లేదా తప్పుకోండి..
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును టీడీపీ స్వాగతిస్తోందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. సోమవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నాలు సరికాదన్నారు. వైసీపీ మంత్రుల దగ్గర్నుంచి, ఉద్యోగ సంఘాల నేతల దాకా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, లేని పక్షంలో పదవులనుంచి తప్పు కోవాలని అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. మరోవైపు..
పాలకుడైనా, పౌరుడైనా అంతే..
సుప్రీం తీర్పు ప్రజాస్వామ్య విజయమని, దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగ బద్దుడేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాలకుడైనా పౌరుడైనా రాజ్యాంగానికి బద్దుడై ఉండాలని, అతీత శక్తిగా వ్యవహరిస్తే ఎదురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా పని చేయాలని, కోర్టులతో ఎదురు దెబ్బలు తింటున్న జగన్ రెడ్డి వెంట నడుస్తారో.. ప్రజాస్వామ్య హితులుగా నిలుస్తారో ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.
తిరుపతి
ఉపఎన్నిక:
పవన్
రామబాణం
-రూ.30లక్షల
విరాళం
-రాక్షసుడుణ్ని
పండితుడంటూ
అనూహ్యం