క్రమశిక్షణకు మారు పేరు వెంకయ్య - 370 రద్దు బిల్లు ఆమోదంలో కీలక పాత్ర : అమిత్ షా..!!
ఉపరాష్ట్రపతి వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష ఇప్పుడు నెరవేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారని కొనియాడారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి అమిత్ షా.. సరస్వతీ నగర్లోని అక్షర విద్యాలయం సందర్శించారు. అక్షరలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ వార్సికోత్సవంలో పాల్గొన్నారు.

వెంకయ్య మాతృభూమిని మర్చిపోలేదు
వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగారన్నారు. వెంకయ్యనాయుడు నాలుగు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ వెంకయ్యనాయుడు పాల్గొన్నారని అమిత్ షా చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారన్నారు. 370 రద్దు బిల్లు ఆమోదంలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారని చెప్పారు. ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోవద్దనే ఒక మాట ఉందిని గుర్తు చేసారు. వెంకయ్య మాతృభూమిని ఎప్పుడూ మర్చిపోలేదన్నారు.

వెంకయ్యనాయుడి గొప్ప ఆలోచనగా
స్వర్ణభారత్ ట్రస్టు.. వెంకయ్యనాయుడి గొప్ప ఆలోచనగా పేర్కొన్నారు. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆయన పరితపిస్తుంటారని ప్రశంసించారు. మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ ఎంచుకున్నారని వివరించారు. విద్యార్థి స్థాయి నుంచే నాయకుడిగా ఉన్నారని..యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారని గుర్తు చేసారు. జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో వెంకయ్య పాల్గొన్నారన్నారు. జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని,,. నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారని చెప్పుకొచ్చారు.

తన అభిలాష నెరవేరిందంటూ
ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థుల కోసమే ఆలోచించేవారని అభినందించారు. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష నెరవేరిందంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. గతంలో సిఫార్సుల మేరకే పద్మ పురస్కారాలు దక్కేవి. ప్రతిభ, సేవతోనే ఇప్పుడు పద్మ పురస్కారాలు వరిస్తున్నాయి. అతి సామాన్య గిరిజనులు పద్మశ్రీ పొందడం చూస్తున్నాం. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు రాష్ట్రపతి భవన్కు వస్తున్నారని అమిత్షా అన్నారు.

రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
అన్నదాతలైన రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో..సేవాలయానికి వెళ్లినా అంతే పుణ్యమన్నారు. సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతానని తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్టును పరిశీలించాలని అందరినీ ఆహ్వానిస్తుంటానన్నారు. సేవా సంస్థలను ప్రోత్సహిస్తారనే కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్ కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలని... యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలని వెంకయ్య పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications