Sri Reddy: శ్రీరెడ్డిపై యాక్షన్ షురూ-అనకాపల్లితో మొదలు..! సారీ చెప్పినా..
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం యాక్షన్ కు దిగింది. పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్ కు కూడా పంపారు. వీరిలో కొందరిని కస్టడీలోకి తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో గతంలో కూటమి నేతలపై రెచ్చిపోయిన వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇందులో నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితకు, వారి కుటుంబ సభ్యులకు సారీ చెప్తున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు. తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతోనే ఇలా సారీ చెప్తున్నట్లు తెలిపారు. ఇకపై వారి జోలికి రానని చెప్పేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆమె వ్యవహారాన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. శ్రీరెడ్డి గతంలో తన వ్యాఖ్యలపై సారీ చెప్పినా ఇతర వైసీపీ కార్యకర్తల తరహాలోనే ఆమెపైనా చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది.

ఇందులో భాగంగా సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, అనితపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, చెన్నా సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి, కె.వసంత ఫిర్యాదు చేశారు. ఇందులో శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఈ ఫిర్యాదుతో చర్యలకు దిగబోతోందా అన్న చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications