విభజనపై క్షమాపణ చెప్పలేదు.. కాంగ్రెస్లో ఎందుకు: ఆనం బ్రదర్స్ సంచలనం
విజయవాడ: ఏపీ విభజన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదని, పార్టీ పరువు నిలబెట్టేందుకే తాము 2014 ఎన్నికల్లో పోటీ చేశామని, అభ్యర్థులు దొరకని పరిస్థితులు కనిపించాయని, అయితే ఎన్నికలు జరిగి 18 నెలలు గడుస్తున్నా విభజన పైన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పక పోవడం దారుణమని ఆనం సోదరులు అన్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలు బుధవారం ఉదయం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరువు కోసమే తాము 2014 ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. జిల్లా నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర, ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావులతో మాట్లాడామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో టిడిపి సభ్యత్వం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన దురదృష్టమన్నారు. విభజన ప్రజల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వల్ల ఏపీ దయనీయ పరిస్థితిలో ఉందన్నారు.
అభివృద్ధి కొరవడి, రాజధాని లేక అయోమయ స్థితిలో ఉందన్నారు. 2014లో తాము ఓడిపోతామని, డిపాజిట్లు రావని తెలిసినా పోటీ చేశామన్నారు. పార్టీ పరువు కోసమే పోటీ చేశామన్నారు. పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ తప్పు జరిగిందని ఈనాటికి చెప్పే పరిస్థితి లేదన్నారు.
చేసిన తప్పును తప్పుగా చెబితే, క్షమించాలని అడిగితే బాగుండేదన్నారు. తప్పు చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్పనప్పుడు ఇంకా ఆ పార్టీలో ఉండటం ఎందుకని తాము పునరాలోచన చేశామన్నారు. యువతరం భవిష్యత్తు కోసమే తాము టిడిపిలో చేరామన్నారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు. పార్టీ కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోదని తాము అప్పుడే అధిష్టానానికి చెప్పామన్నారు. కొత్త రాష్ట్రంలో రాజధాని ఏర్పడాలన్నా, సమగ్ర అభివృద్ధి కావాలన్నా చంద్రబాబుతో సాధ్యమని ప్రజలు కూడా నమ్మారన్నారు.
చంద్రబాబు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారన్నారు. అభివృద్ధికి శ్రీకారం చుట్టేది ఆయనేనని చెప్పారు. ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబుకు నైతిక మద్దితిచ్చేందుకే పార్టీలో చేరామన్నారు. అన్నీ ఆలోచించామని తెలిపారు. అధికారం, పదవుల కోసం తాము టిడిపిలో చేరలేదన్నారు.