ఆనందయ్య కరోనా మందు-అధ్యయనంలో అనుకోని అవాంతరాలు-ఏం జరిగిందంటే...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనానికి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్-సీసీఆర్ఏఎస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కాలేజీ,విజయవాడలోని ప్రాంతీయ పరిశోధన సంస్థ ఆనందయ్య మందుపై పరిశోధన జరుపుతున్న సంగతి తెలిసిందే. పరిశోధనలో భాగంగా తొలుత ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలని భావించారు. కానీ వారి వివరాలను సేకరించడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి.
Recommended Video
500 మంది నంబర్ల సేకరణ...
ఆనందయ్య వద్ద దాదాపు 70వేల పైచిలుకు మంది నాటు మందు తీసుకుని ఉంటారని అధికారులు అంచనా వేశారు.సీసీఆర్ఏఎస్ అధ్యయనం కోసం ఇందులో 500 మంది నుంచి వివరాలు సేకరించాలని తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీ నిపుణులు భావించారు. అయితే మందు ఇచ్చే సమయంలో ఆనందయ్య వారి వద్ద నుంచి ఎటువంటి వివరాలు సేకరించలేదు. దీంతో నెల్లూరు జిల్లా ఎస్పీ సహకారంతో 500 మంది నంబర్లు సేకరించగలిగారు. అయితే ఈ నంబర్ల ద్వారా మందు తీసుకున్నవారిని సంప్రదించే ప్రయత్నం చేయగా సరైన స్పందన రాలేదని తెలుస్తోంది.
సరైన స్పందన లేదు...
ఎస్వీ ఆయుర్వేద కాలేజీకి చెందిన నిపుణులు,విజయవాడలోని ప్రాంతీయ పరిశోధన సంస్థకు చెందిన నిపుణులు సోమవారం(మే 24) నుంచి ఆ ఫోన్ నంబర్లకు కాల్ చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇందులో 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని తెలుస్తోంది. మరో 42 మంది తాము అసలు మందు తీసుకోలేదని చెప్పినట్లు సమాచారం. కొంతమంది వివరాలు వెల్లడించినప్పటికీ అవి సంతృప్తికరంగా లేవని తెలుస్తోంది. దీంతో మరికొందరి ఫోన్ నంబర్లు పంపించాల్సిందిగా నెల్లూరు ఎస్పీని ఎస్వీ ఆయుర్వేద కాలేజీ అధికారులు కోరినట్లు తెలుస్తోంది.
ఆ నివేదికలు వచ్చాకే పంపిణీపై నిర్ణయం
ఆనందయ్య మందుపై తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ కూడా ఉంటాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదికను అందజేస్తామని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ మనుషులపై చేయాలా లేక జంతువుల పైనా అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందన్నారు. ఇప్పటికే ఐసీఎంఆర్ బృందం కూడా ఆనందయ్య మందుపై అధ్యయనం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్,సీసీఆర్ఏఎస్ల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆనందయ్య మందులో ఎటువంటి హానికారక పదార్థాలు లేవని ఇదివరకే ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. కంటిలో వేసే చుక్కల మందులోనూ సాధారణ పదార్థాలే వాడుతున్నారని చెప్పారు. అయితే మందు తయారీలో ఆయుర్వేద ప్రోటోకాల్స్ పాటించడం లేదని... కాబట్టి దాన్ని నాటు మందుగానే గుర్తిస్తామని స్పష్టం చేశారు.