మరో వివాదంలో స్వామి ప్రబోధానంద...అరెస్ట్ చేయాలంటూ స్థానికుల ధర్నా:తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత
అనంతపురం:అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఒక శిష్యుడిని స్వామి ప్రబోధానంద రక్షిస్తున్నారంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే...
స్వామి ప్రబోధానంద శిష్యుడు నాగరాజు అనే వ్యక్తి గ్రామంలోని ఇంటిముందు ముగ్గు వేస్తున్న యువతి కళ్లల్లో కారం కొట్టి కిడ్నాప్కు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఆమె అరుపుల విని బయటకు వచ్చిన యువతి తల్లిదండ్రులు నాగరాజుపై దాడి చేశారు. దీంతో యువతి తల్లిదండ్రులు తనపై దాడి చేశారంటూ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో పోలీసులు అసలేం జరిగిందో తెలియకుండా బాధితులను ప్రశ్నించడమేమిటని...నిందితుడిని స్వామి ప్రబోధానంద రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
తప్పు చేసిన శిష్యుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న స్వామి ప్రబోధానందను వెంటనే అరెస్ట్ చేయాలంటూ స్టేషన్ ముందు బైఠాయించారు ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలోని టీడీపీ కార్యకర్తలు. ఆ క్రమంలో ప్రధాన రహదారిపై వీరు ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.