వైఎస్ జగన్ సంచలనం: సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు కుదరవిక: కట్టడిపై
అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఇష్టానుసారంగా నకిలీ వార్తలు వెల్లువెత్తుతోన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి- ఎన్నికల సమయం వచ్చేసరికి కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ పుట్టుకొస్తోన్నాయనే నిర్ధారణకు వచ్చింది. ఇదివరకు రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకున్న దేవాలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలన్నింటినీ ఈ జాబితాలోకే చేర్చింది. ఎవరు, ఏది చేసినా.. దాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అంటగట్టేలా ప్రత్యర్థులు వ్యవహరిస్తున్నారని భావిస్తోన్న ప్రభుత్వం.. ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది.
Recommended Video
విగ్రహల విధ్వంసం మొదలుకుని..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విచ్చలవిడిగా సోషల్ మీడియా వేదికగా నకిలీ వార్తలు వెల్లువెత్తినట్లు ప్రభుత్వం గుర్తించింది. అత్యంత సున్నితమైన దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందంటూ అప్పట్లో వైసీపీ ప్రత్యర్థులు ఆరోపించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన విస్తృతంగా వాటిని ప్రచారం చేశాయి. దర్యాప్తు సందర్భంగా ఆయా ఘటనల్లో వైసీపీ నేతల ప్రమేయం ఏదీ లేదంటూ తేలిన విషయం తెలిసిందే. తాజాగా- గుంటూరు జిల్లా ఎడ్లపాడు ఉదంతంపైనా బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు ఇలాంటి ఆరోపణలే చేశారని ఇప్పటికే గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.
స్కూళ్లకు సెలవుల వరకు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మార్చి 1వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపించే ఈ ప్రకటన ఫేక్గా ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని నమొద్దంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం ఎత్తు తగ్గింపు వ్యవహారంలోనూ ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన గానీ, నిర్ణయాన్ని గానీ తీసుకోనప్పటికీ.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారనే వార్తలు వెలువడ్డాయి. దాినికి ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.
ఫ్యాక్ట్ చెక్ పేరుతో..
ఈ పరిస్థితిని అధిగమించడానికి జగన్ సర్కార్.. కొత్తగా ఓ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://factcheck.ap.gov.in పేరుతో రూపొందించిన ఈ పోర్టల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. సోషల్ మీడియా సహా ఎక్కడ, ఎలాంటి నకిలీ వార్తలు ప్రచురితమైనా దాన్ని ఈ వెబ్సైట్ ట్యాగ్ చేసేలా రూపకల్పన చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లోనూ దీనిపై ఓ ప్రత్యేక పేజీను రూపొందించారు. నకిలీ వార్తగా తేలితే.. దాన్ని పోస్ట్ చేసిన వారు సమగ్రమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.