శ్రీలంకలో ఆంధ్ర దంపతుల మృతి: వారం క్రితమే వెళ్లారు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరం గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన యువతీయువకులు ఇద్దరు శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారి మృతిని పోలీసులు శుక్రవారం గుర్తించారు.
విశాఖపట్నం గాజువాకకు చెందిన టి పృధ్వీరామ్ (30), నాగబోయిన మహాలక్ష్మి (27) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు వారం రోజుల కిందట శ్రీలంక వెళ్లారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఒక హోటల్లో దిగారు.
ఈ నెల 2వ తేదీ రాత్రి హోటల్ గదిలోకి వెళ్లిన జంట తిరిగి బయటకు రాకపోవటంతో అనుమానించిన హోటల్ సిబ్బంది శుక్రవారం గది తెరచి చూడగా, ఇద్దరూ మృతి చెంది ఉన్నట్టు గుర్తించారు.
ఈ విషయాన్ని విశాఖ నగర పోలీసులకు సమాచారం అందించారు. నగర స్పెషల్బ్రాంచ్ ఎసిపి ఆర్ఎంకె మూర్తి గాజువాకలోని వారి కుటుంబసభ్యులకు సమాచారం తెలిపారు.
మృతి చెందిన యువకుడి వయస్సు 30 ఏళ్లు, మహిళ వయస్సు 27 ఏళ్లు ఉండవచ్చునని అంటున్నారు. నిజానికి, వారిద్దరు కొలంబో సమీపంలోని వెల్లవెట్టాలో గల ఈ హోటల్లో మార్చి 27వ తేదీ నుంచి ఉంటున్నారు.