టీటీడీ డబ్బులతో రోడ్ల అభివృద్ధి: తిరుమలకు వచ్చే భక్తులు కాబట్టే..!!
TTD: రోడ్ల మరమ్మతు, నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చేలా ఆదేశాలనూ జారీ చేసింది.
2021లో జవాద్ తుఫాన్ కారణంగా సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న నాలుగు రోడ్లు, కాజ్వేల నిర్వహణ, మరమతు పనులను తిరుమల తిరుపతి దేవస్థానానికి బదలాయించింద. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న ఆదేశాలను జారీ చేశారు.

తిరుపతి- కొత్తపల్లి మిట్ట, తిరుపతి- తణపల్లి, తిరుపతి- పూడి, ఐతేపల్లి-రంగంపేట క్రాస్ రోడ్లు ఈ జాబితాలో ఉన్నాయి. 2021లో జవాద్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల ఆయా రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని, వాటిని తక్షణమే మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి శాసన సభ్యుడు పులివర్తి నాని.. చంద్రబాబుకు లేఖ రాశారు.
వాహనాల రాకపోకలు సాగించడానికి ఆయా రోడ్లు ఏ మాత్రం అనువుగా లేవని పులివర్తి నాని ఈ లేఖలో పేర్కొన్నారు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చంద్రగిరి అసెంబ్లీతో పాటు పొరుగునే ఉన్న నగరి నియోజకవర్గాల పరిధిలోకి ఆయా రోడ్లు వస్తాయని, 40 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు.
ఫలితంగా- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వేలాదిమంది భక్తులు ఇబ్బందులు పడుతోన్నారని, రోడ్లు బాగలేకపోవడం వల్ల 25 నుంచి 30 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వస్తోన్నారని పులివర్తి నాని ఈ లేఖలో స్పష్టం చేశారు.
ఈ లేఖను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులే కావడం వల్ల వారికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యతను టీటీడీ అధికారుల మీదే ఉందని భావించింది చంద్రబాబు సర్కార్. అందుకే- ఆ నాలుగు రోడ్ల నిర్వహణ, మరమ్మతు పనులను టీటీడీకీ అప్పగించింది.












Click it and Unblock the Notifications