ఏపీ అసెంబ్లీ: గొడుగు, రెయిన్ కోట్తో వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేత ఆగ్రహం
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీకి బీజేపీ ప్రతినిధులు గొడుగులతో వచ్చి నిరసన తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోనే ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ లీకుల మయంగా ఉందని, చిన్నపాటి వర్షం కురిస్తే నీళ్లు కురుస్తున్నాయని విమర్శించారు. అందుకే ముందు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చామన్నారు. రూ.1000 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజా ధనం దుర్వినియోగంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారన్నారు. చదరపు అడుగుకు రూ.10వేలు వెచ్చించి తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం చేయించిన ఘనత బాబుకే దక్కిందన్నారు.
ఏపీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి 19వ తేదీ వరకు జరగనున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు అంతకుముందు తెలిపారు. కాల్వ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... సమావేశ వివరాలు తెలియజేశారు. మొత్తం ఏడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయన్నారు.
BJP MLAs & MLCs came to the #AndhraPradesh assembly today wearing rain coats & carrying umbrellas. This innovative protest was against the govt because every time it rains the assembly ceiling has been leaking despite an exorbitant rate of 10,000/sq yard spent on construction. pic.twitter.com/3nJsFBiGGQ
— Paul Oommen (@Paul_Oommen) September 6, 2018
కాగా, సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యశాఖ పని తీరు, ఆసుపత్రుల్లో పరిస్థితులపై సభ్యులు ప్రశ్నించారు. విశాఖ కెజీహెచ్లో పరిస్థితులను బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు వివరించారు. పలాస హెల్త్ సెంటర్లో సరైన వైద్యం అందటం లేదని ఎమ్మెల్యే గౌతు శివాజీ అన్నారు. తమ నియోజవకర్గంలో అదే పరిస్థితి ఉందని తణుకు, తాటికొండ ఎమ్మెల్యేలు అన్నారు.
బీజేపీ నేతలపై టీడీపీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. బీజేపీ నేతలు ఆటలో బుడంకాయల్లా మారారన్నారు. బీజేపీ పగటి వేషగాళ్లతో ఒరిగేదేమీ లేదన్నారు. అసెంబ్లీకి రాని వైసీపీ వెనుకుండి బీజేపీతో ఆటలుఆడిస్తోందన్నారు. దేశ ప్రజల జేబులకు మోడీ చిల్లులు పెట్టారన్నారు. మోడీని ఎప్పుడు సాగనంపాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పని తీరుతో మోడీ, జగన్లకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు.