ప్రమాదంపై జగన్, మీకు చేతకాకుంటే మేమొచ్చాం: ఊగిపోయిన వైసిపి నేత, తొలుత స్పందించింది వారే
ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద పవిత్ర సంగమం ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. విషయం తెలిసి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయవాడ: ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద పవిత్ర సంగమం ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. విషయం తెలిసి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలన్నారు.
Recommended Video
చదవండి: ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!
గంట వరకు ఎవరూ రాలేదని వైసీపీ ఆగ్రహం
అంతకుముందు ప్రమాద సంఘటన వద్దకు వైసీపీ నాయకులు పార్థసారథి, జోగి రమేష్ తదితరులు వచ్చారు. వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రమాదం జరిగిన గంట వరకు ఎవరూ రాలేదని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వచ్చే వరకు అంబులెన్సులు కూడా లేవన్నారు. గాయపడ్డ వారిని ఆటోలలో పంపించారని మండిపడ్డారు.
మీకు చేతకాకుంటే మేం వచ్చాం
మీకు చేతకాకుంటే మేం వచ్చామని, మా స్విమ్మర్లను పంపించామని వైసీపీ నేత జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బోటుకు అనుమతి చూసుకున్నారా అని నిలదీశారు. లైఫ్ జాకెట్లు చూసుకోకుండా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
ఈ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యం కారణమని పార్థసారథి సహా వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ కేడర్ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
రాజకీయం సరికాదన్న బుద్ధా వెంకన్న
బోటు ప్రమాదంపై రాజకీయం సరికాదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. విషయం తెలియగానే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించినట్లు చెప్పారు. చనిపోయారనే సానుభూతి లేకుండా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సీఎం డౌన్ డౌన్ అనడం విడ్డూరమన్నారు.
సహాయక చర్యలకు ఆంటంకం ఏర్పడుతోంది
కాగా, ప్రమాదం సమయంలో బోటులో 38 మంది ఉన్నట్లు తొలుత వార్తలు వచ్చినా డ్రైవర్తో సహా 41 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒంగోలు వాకర్స్ క్లబ్కు చెందిన వారితో పాటు నెల్లూరు వాసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ఒంగోలువాసులు, ఆరుగురు నెల్లూరువాసులు ఉన్నారు. ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్ మెంబర్ కుటుంబాలతో సహా రెండు బస్సుల్లో వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడం, చలి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది.
ప్రమాదం జరగ్గానే తొలుత స్పందించింది మత్స్యకారులే
ప్రమాదం జరగ్గానే తొలుత స్పందించింది స్థానిక మత్య్సకారులే అని తెలుస్తోంది. వాళ్లు వెంటనే స్పందించడంతో మరింతమంది ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు 15 మందిని రక్షించారు. గంటసేపటి తర్వాతే రెస్క్యూ టీం వచ్చిందని అంటున్నారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను, 14 బోట్లను రంగంలోకి దించారు.