అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు: రోడ్లపైకి గ్రామస్తులు..పోలీసులతో వాగ్వాదం: మీడియాపైన దాడి..!
రాజధాని వ్యవహారంపైన కేబినెట్ సమావేశమైంది. మరోవైపు అదే ప్రాంతంలోని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించినా..స్థానిక గ్రామాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మందడంలో రోడ్ల మీదకు గ్రామస్థులు రావటంతో..వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఆ సమయంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసు కుంది. మండదం గ్రామాన్ని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారు. ఉద్దండరాయుని పాలెం వద్ద పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగారు. అదే విధంగా ఇతర గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల్లో స్థానికులు మీడియా ప్రతినిధుల పైన దాడి చేసారు. ఒక మీడియా సంస్థకు చెందిన వాహనాలను ధ్వసం చేసారు. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు రావటంతో పాటుగా వారు దీక్షా శిబిరం లో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జేఏసీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకోవద్దంటూ నినాదాలు చేస్తున్నారు.

పోలీసుల వలయం..స్థానికులతో వాగ్వాదం
సచివాలయం సమీపంలో పోలీసుల బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. మందడం..మల్కాపురం గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గత పది రోజులుగా మందడం గ్రామంలో స్థానికులు..రైతులు ప్రతీ రోజు ఉదయం నుండి రాత్రి వరకు నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశం ఉండటంతో ఉదయం నుండి అక్కడ దీక్షలకు ఎవరూ దిగకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..కేబి నెట్ సమావేశం ప్రారంభమైన తరువాత మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు.
వారితో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. పలువురు మహిళలు తాము రాజధానికి భూములు ఇచ్చామని..ముఖ్యమంత్రి ఇక్కడ నుండి రాజధానిని మార్చవద్దని వేడుకుంటున్నారు. తమ గురించి మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని..మంత్రుల మీద మండిపడుతు న్నారు. మంత్రులు తమ వద్దకు వచ్చి మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. తమ ఇళ్ల నుండి తమను బయటకు రాకుండా అడ్డుకోవటం పైన పోలీసుల తీరు పైన మహిళలు ఫైర్ అవుతున్నారు.
రాకపోకలపైన ఆంక్షలు..
రాజధాని గ్రామాల్లో స్థానికుల రాకపోకలపైన ఆంక్షలు విధించారు. సచివాలయానికి వెళ్లే ఆర్టీసీ బస్సులను రూట్ మార్చారు. ఉద్దండరాయుని పాలెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా దీక్ష తరువాత అక్కడ పరిస్థితుల పైన కవరేజ్ కు వచ్చిన మీడియా ప్రతినిధుల పైన స్థానికులు దాడి చేసారు. ఇక మీడియా సంస్థకు చెందిన వాహనం ధ్వంసం చేసారు.
అయితే, కేబినెట్ లో రాజధాని మార్పు పైన నిర్ణయం ఏదైనా తీసుకుంటే పరిస్థితులు ఏ రకంగా టర్న్ అవుతాయనే ఉత్కంఠ కనిపిస్తోంది. దీంతో..పోలీసులు భారీగా మొహరించారు. తుళ్లూరులో ప్రధాని మోదీ ఫొటోలతో స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications