చంద్రబాబుకు కష్టకాలం: ఆ రోజే చెప్పిన సిద్దాంతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పదవి గండం ఉందని 70 రోజుల క్రితం ఒక ప్రముఖ సిద్దాంతి చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఏ టు జడ్ గా అన్ని తానై వ్యవహరిస్తున్న నారా చంద్రబాబు నాయుడికి పదవి గండం ఏమిటని ఆ పార్టీలోని నేతలు అందరూ కొట్టి పారేశారు.
వివరాలలోకి వెళ్తే, 2015 ఏప్రిల్ 3వ తేది శక్రవారం విజయవాడలోని దుర్గాపురంలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త పులిపాక చంద్రశేఖర్ సిద్దాంతి తన కార్యాలయంలో విలేకరుతో మట్లాడారు. ఏప్రిల్ 4వ తేది శనివారం సంపూర్ణ చంద్ర గ్రహణం ఉందని అన్నారు.
అయితే భారతదేశంలో పాక్షికంగానే ఉంటుందని చెప్పారు. శనివారం మద్యాహ్నం 3.40 గంటల నుండి ప్రారంభమై రాత్రి 7.14 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుందని వివరించారు. అయితే హస్తా నక్షత్రం కన్యరాశి వారిపై చంద్ర గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతక రీత్యా చెడు ఫలితాలు సూచిస్తున్నాయని చంద్రశేఖర సిద్దాంతి స్పష్టం చేశారు. ఆయనకు పదవి గండం తప్పదని కుండలు బద్దలు కొట్టి చెప్పారు. చంద్ర గ్రహణం ప్రభావం ఆరు నెలలు ఉంటుందని అన్నారు.
ఆ ప్రభావం ఎప్పుడు ఎలా పడుతుందో తెలియదని, దీని ప్రభావం తగ్గించుకోవడానికి పండితుల సలహాలు తీసుకోవాలని సూచించారు. గ్రహణ కాలంలో సరస్వతీ నదిలో స్నానం చెయ్యాలని వీలు కాకపోతే నదీ తీరంలో స్నానం చేస్తు వరుణ సూక్తులు పఠించాలని చంద్రశేఖర సిద్దాంతి వివరించారు.
ఇప్పుడు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారు. పార్టీ నేతలు సైతం ఎప్పుడు ఏమి జరుగుతుందో అని హడలిపోతున్నారు. తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఆ సిద్దాంతి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ మాట అక్షరాల నిజం అవుతున్నదని పలువురు పండితులు అంటున్నారు.