బాబు ఇంట్లో సీసీటీవిలకు రూ.36లక్షలు: విడుదల చేసిన ఏపీ సర్కార్!
హైదరాబాద్ లో ఉన్న ఇల్లు బాగు చేసేందుకు అప్పట్లో రూ.20కోట్లు ఖర్చు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత బెజవాడలో ఇల్లు కోసం రూ.5కోట్ల దాకా ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.
చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో సీసీటీవీ కెమెరాలతో సహా వివిధ సౌకర్యాల ఏర్పాటు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.36లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉన్న సీఎం ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
వీటితో పాటు సోలార్ పవర్ ఫెన్సింగ్, ఇంటి బయట సెక్యూరిటీ కోసం లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ రెంటల్ హౌసింగ్ స్కీమ్ కింద ఏపీ సర్కార్ శుక్రవారం ఈ నిధులను విడుదల చేసింది. పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆర్&బీ చీఫ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)ను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలా ఉంటే, సీఎం దుబారా ఖర్చులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ముందు నుంచి విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న ఇల్లు బాగు చేసేందుకు అప్పట్లో రూ.20కోట్లు ఖర్చు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత బెజవాడలో ఇల్లు కోసం రూ.5కోట్ల దాకా ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇంటికి వెళ్లేందుకు దారులు.. కరెంట్ బిల్లు ఇతరత్రా కలిపి రూ.22కోట్ల దాకా ఖర్చు చేసినట్లు ప్రతిపక్షాలు తిట్టిపోశాయి.
ఇవిగాక క్యాంప్ ఆఫీసులు మరమ్మత్తులు, హైదరాబాద్ లో కేటాయించిన సెక్రటేరియట్ కు రీమోడలింగ్ వంటి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. వీటికి తోడు చంద్రబాబు విదేశీ ప్రయాణాల పట్ల విమర్శలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ప్రధానిని మించిన స్థాయిలో ఆయన విదేశీయానాలు చేస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.