సీఆర్డీఏ పరిధిని ఫ్రీజోన్గా చేసే యోచనలో పోలీసు డిపార్ట్మెంట్..!
అమరావతి: కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిని ఫ్రీజోన్గా చేయాలని పోలీసు డిపార్ట్మెంట్ భావిస్తోంది. పోలీసు రిక్రూట్మెంట్లో 13 జిల్లాలకు చెందిన వారికి సరైన ప్రాధాన్యం కల్పించే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీఆర్డీఏ పరిధి వివిధ రెవెన్యూ జిల్లాలు, జోన్లలో విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చెయ్యడమెలా అనే అంశంపై డీజీపీ కార్యాలయం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఏపీ డీజీపీ జేవీ రాముడు సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా పోలీసు విభాగంలో ఎస్సై పోస్టుల్ని జోనల్ స్ధాయిలో ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ జరిగే జోన్కు చెందిన వారికి 70 శాతం (లోకల్), బయటి జోన్ల వారికి 30 శాతం (నాన్-లోకల్) కోటా ఉంటుంది. ఇక కానిస్టేబుల్ స్థాయి వారిని యూనిట్లుగా పిలిచే జిల్లాల వారీగా ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో లోకల్స్కు 80 శాతం, నాన్-లోకల్స్కు 20 శాతం కోటా ఉంటుంది.
ఈ రూల్స్ ప్రకారం ఎంపిక చేస్తే రాజధానితో పాటు సీఆర్డీఏ పరిధిలో పోలీసు డిపార్ట్మెంట్లో కేవలం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారు మాత్రమే ఉంటారు. ఇలా కాకుండా ఫ్రీ జోన్ చేస్తే అన్ని జిల్లాలకు చెందిన వారికి సమప్రధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.
ఉమ్మడి రాజధానిలో ఉన్న హైదరాబాద్లోని పోలీసు కమిషనరేట్ సైతం చాలా కాలం పాటు ఫ్రీజోన్గా కొనసాగింది. ఫ్రీ జోన్ చేయడం వల్లనే ఉమ్మడి రాజధానిలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగాలు పొందారు. ఇందుకోసం సిటీ పోలీసు చట్టంలో ప్రత్యేకంగా '14ఎఫ్' నిబంధన ఉంది.
సీఆర్డీఏ పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది. రెవెన్యూ పరంగా రెండు జిల్లాలు, పోలీసు పరంగా రెండు జోన్లలో ఉంది. కృష్ణా జిల్లా ఏలూరు రేంజ్లో ఉండగా, గుంటూరు జిల్లా గుంటూరు రేంజ్లో ఉంది. దీనిని బట్టి కానిస్టేబుల్ పోస్టుల ఎంపికకు యూనిట్, ఎస్సై ఎంపికకు జోన్ సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ పరిధిని ఫ్రీ జోన్ విధానం అమలులో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.