సుప్రీంకోర్టుకైనా వెళ్తాం: చంద్రబాబు, కేసీఆర్, నీతి ఆయోగ్ వైస్ఛైర్మన్ వ్యాఖ్యలపై ఆవేదన
Recommended Video
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ, శాంతి భద్రతలపై చర్చ జరిగింది.
ఏపీలో అధికారం ఇవ్వమంటారా?: మోత్కుపల్లిపై పెద్దిరెడ్డి, లోకేష్, సోమిరెడ్డి ఇలా
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు సమావేశంలో మాట్లాడారు. నాడు యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై బాబు ఆవేదన
గురువారం ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రతో తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ అనడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. రాజధాని కాబట్టే ఏపీ ప్రజలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారనడం బాధాకరమని అన్నారు. 1995కు ముందు, ఆ తర్వాత ఫలితాలను చూస్తే వాస్తవాలు తెలుస్తాయని, చంద్రబాబు.. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కాగా, ఆంధ్రా పాలకులు తెలంగాణను విధ్వంసం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను నిర్లక్ష్యం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య కూడా అభ్యంతరం తెలిపారు.
తెలంగాణ ప్రజలను నిందించను
అయితే, తాను తెలంగాణ ప్రజలను నిందించను అని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలేమీ తప్పు చేయలేదని, నాటి కొందరు పాలకులు చేసిన పాపం ఫలితమిది అని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలు చేతగానివాళ్లేం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల ప్రమేయం లేకుండానే విభజన చేశారని, అందరితో మాట్లాడి న్యాయం చేయాలంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.
‘చిరంజీవి'ని జపాన్లో చూసి కేటీఆర్ షాక్: రాజ్దీప్కు ఆసక్తికర రిప్లై(పిక్చర్స్)
హోదా ఎలా ఇస్తామంటారా?
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని రాజీవ్ కుమార్ అనడం సరికాదని అన్నారు. ఏపీ తలసరి ఆదాయం 35వేలకు పెరిగితేనే పొరుగు రాష్ట్రాలతో సమానమవుతుందని చెప్పారు.
సుప్రీంకోర్టుకైనా వెళ్తాం
ఇతర రాష్ట్రాల స్థాయికి వచ్చే వరకూ కేంద్రం ఏపీకి సాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర సాయం విషయంలో రాజీలేని పోరాటం కొనసాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని స్పష్టం చేశారు.
ఏపీ హోదా ఎలా అంటూ రాజీవ్ కుమార్
తలసరి ఆదాయంలో జాతీయ సగటు కన్నా ముందున్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం ఎలా సాధ్యమని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తనకు సంబంధించిన అంశం కానప్పటికీ రాష్ట్రం నుంచి అభ్యర్థన వస్తే చూద్దామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ‘రియల్ టైం గవర్నెన్స్ను (ఆర్టీజీ) గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడించారు.
ఏపీ లక్ష్యాలు అద్భుతం
వివిధ రాష్ట్రాల సందర్శనలో భాగంగా అందరు ముఖ్యమంత్రులను కలుస్తున్నామని, ఈ క్రమంలో బుధ, గురువారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అనేక విషయాలపై చర్చించామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యాలు అద్భుతమని కొనియాడారు. తూర్పు కోస్తా, పశ్చిమ కోస్తాగా రెండు ఆర్థిక జోన్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని, ఆదాయపరంగా ఇందులో కొన్ని సమస్యలున్నాయని, ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తుందని వివరించారు. నీతి ఆయోగ్ సంబంధిత అంశాలపై త్వరితగతిన పరిష్కారం కోసం రాష్ట్రాల వారీగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒక సలహాదారు పని చేస్తున్నారని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
వేగంగానే పోలవరం
పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న దాని కంటే వేగంగా జరుగుతున్నాయని, కేంద్రం నుంచి తగినంత సహకారం అందించేందుకు కృషి చేస్తానని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నమూనాను చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పనులు ఊహించిన దాని కంటే వేగంగా జరుగుతున్నాయని, త్వరలో మరోసారి ప్రాజెక్టు సందర్శనకు వస్తానని చెప్పారు. అసలు పోలవరం నిర్మాణానికి ఇన్ని దశాబ్దాలు ఎందుకు పట్టిందని జల వనరులశాఖ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు.