రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే: చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఉమ్మడి హైకోర్టు చంద్రబాబు సర్కారుకు సూచించింది. భూసేకరణ నిమిత్తం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వాటిని ఎన్నికల హమీలుగా మార్చవద్దని సూచించింది.
"గతంలో రైతులకు ఇచ్చిన హామీలను పక్కన బెడితే మేం చూస్తూ ఊరుకోబోం" అని చీఫ్ జస్టిస్ దిలీప్ బీ భోసాలె, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. భూసేకరణ అంగీకరించి భూములిచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల ఓంకార్, మరో 54 మంది రైతులు వేసిన పిటిషన్పై శుక్రవారం కోర్టు విచారణ జరిపింది.
రైతుల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఈ మనోహర్, భూ సేకరణ నిబంధనలను, రైతుల నుంచి భూములు తీసుకున్న తర్వాత మార్చారని, దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రైతులకు ఇస్తామన్న ప్రయోజనాలు తగ్గుతున్నాయని వాదించారు.
భూసేకరణలో భాగంగా ప్రభుత్వం వాస్తవానికి సేకరించినదంతా మాగాణి భూమేనని, వ్యవసాయానికి కృష్ణా నది నుంచి నీరందకనే మెట్ట పంటలు వేసుకుంటున్నామని రైతుల తరఫున మనోహర్ హైకోర్టుకు తెలిపారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తులు, రైతులకు అన్యాయం జరిగితే, అండగా నిలుస్తామని చెప్పారు.
చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు ముద్దుబిడ్డ: వాసిరెడ్డి పద్మ
90 శాతం పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వందల కోట్ల రూపాయల కమీషన్లు, ముడుపులు చేతులు మారుతున్నాయన్నారు.
18 నెలల్లో జరిపిన సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అలా లేనిపక్షంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు ముద్దుబిడ్డ అని ఆమె వ్యాఖ్యలు చేశారు. వాల్మార్ట్ దోపిడీకి గేట్లు బార్లా తెరవడం దుర్మార్గమని ఆమె విమర్శించారు.