ఎవరితో మాట్లాడలేదు, అందరినీ కూడగట్టను: బాబు ఊహించని ట్విస్ట్, పవన్కు హెచ్చరిక
అమరావతి: తాము ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నందున దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోందన టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.
తాను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడలేదని చెప్పారు. అందరినీ కూడగట్టే ఆలోచన తనకు లేదన్నారు. అయితే, మమతా బెనర్జీ, ములాయ వంటి వారే ఆయనకు ఫోన్ చేస్తుండటం గమనార్హం. అంటే వారే అవిశ్వాసానికి మద్దతుగా వస్తారని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా తన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాలేనని బాబు తేల్చి చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఉండవద్దనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందుకే బయటకు వచ్చాం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి పీఎంవో చుట్టూ తిరుగుతూ ఆ పార్టీ ప్రజలకు ఏం చెబుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్డీయేలో ఉండి అవిశ్వాస తీర్మానం పెట్టడం నైతికత కాదని, అందుకే బయటకు వచ్చామన్నారు.

పవన్ ఇలా మాట్లాడుతారనుకోలేదు
తమ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో తెలియదని చంద్రబాబు అన్నారు. అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తనను విమర్శించేందుకేనా అని ప్రశ్నించారు. పవన్ ఇంత ఏకపక్షంగా మాట్లాడుతారని అనుకోలేదన్నారు. లోకేష్కు డబ్బులతో పని లేదని, వ్యాపారం చేసుకునే అవకాశమున్నా ఇటు వచ్చాడని చంద్రబాబు చెప్పారు.

మోసం చేసిన మోడీని వదిలేశాం
మంత్రి అమర్నాథ్ రెడ్డి బీజేపీ, పవన్ పైన నిప్పులు చెరిగారు. కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక హోదానే తాము అడుగుతున్నామని చెప్పారు. మోసం చేసిన మోడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామన్నారు. ఏపీకి ద్రోహం చేసినందుకే అవిశ్వాసానికి మద్దతిచ్చామని చెప్పారు.

పవన్ కళ్యాణ్కు హెచ్చరిక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అమర్ననాథ్ రెడ్డి అన్నారు. ఆయన ఎప్పుడు స్పందిస్తారో, ఎందుకు స్పందిస్తారో ఆయనకే తెలియని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications