కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల తర్వాత పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) తాజాగా నీట్ అక్రమాలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై గట్టిగా పోరాడి ఆయనతో రాజీనామా చేయించింది. అయితే ీ టాస్క్ తర్వాత ఏం చేయాలి ? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో సమగ్ర చర్చల తర్వాత సీజేపీ (CJP) 12 మందితో ముందుగా ఓ టీమ్ ప్రకటించింది. ఇందులో అంతా సీఏలు, లాయర్లు, ఐఐటియన్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలే. తాజాగా మహారాష్ట్రలో నిర్వహించిన 2 రోజుల భేటీ తర్వాత సీజేపీ వీరి పేర్లు, వివరాలు ప్రకటించింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించిన 12 మంది టీమ్ లో ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు, జర్నలిస్టులు, ఒక పారిశ్రామికవేత్త, ప్రజా పరిపాలన, విధాన రూపకల్పన, సాంకేతికత, వ్యాపార రంగాలలో అనుభవం ఉన్న నిపుణులు ఉన్నారు. ఇందులో ముందుగా పార్టీ వ్యవస్దాపకుడు, జాతీయ కన్వీనర్ అయిన అభిజిత్ దిప్కే మహారాష్ట్రలోని శంభాజీ నగర్కు చెందిన వారు. పూణేలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీ, అలాగే అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అలాగే సహ కన్వీనర్ గా ఉన్న అశుతోష్ రంకా రాజస్థాన్లోని జైపూర్కు చెందిన వారు. ఐఐటీ కాన్పూర్ నుండి బీటెక్ పట్టా పొందారు. దీంతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశారు. మరో సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఢిల్లీకి చెందిన వారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేశారు.

వీరు కాకుండా జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించిన అజింక్య షిండే మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన వారు. లోనెరేలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DBATU) నుండి బీటెక్ పట్టా పొందారు. అలాగే సహ-ఇన్ఛార్జ్, ఉత్తర జోన్ ఇన్ ఛార్జ్ గా కూడా నియమితులైన దీపక్ బలియాన్ .. రాజస్థాన్లోని అల్వార్కు చెందిన వారు. ఆయన భరత్పూర్ నుండి పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. రైతు కుటుంబ నేపథ్యం కలిగిన ఆయన, గతంలో వ్యవసాయ సంబంధిత ఉద్యమాలలో కూడా పాలుపంచుకున్నారు. అలాగే జాతీయ కార్యదర్శిగా ఎంపిక చేసిన ఆఫ్రీన్ నవాజ్
బెంగళూరుకు చెందిన వారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆమె.. ఒక పారిశ్రామికవేత్త. అలాగే మీడియా విభాగం అధ్యక్షుడిగానూ, దక్షిణ జోన్ అధ్యక్షుడిగానూ ఎంపికైన మల్లంగి విజయ్ రెడ్డి హైదరాబాద్ కు చెందిన వారు. ఉస్మానియాలో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి కొలంబియా యూనివర్సిటీ నుండి అప్లైడ్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

ఇక న్యాయవ్యవహారాలు చూస్తున్న రత్న సింగ్.. లక్నోకు చెందిన వారు. ఆమె ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీపట్టా పొందారు. ఆమె సంస్థ న్యాయ వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహిస్తారు.అలాగే పరిశోధన, విధాన విభాగాధిపతిగా నియమితులైన వైష్ణవి గౌర్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన వారు. చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఎల్ఎల్బీ (ఆనర్స్) పట్టా పొందారు. ఇక టెక్నాలజీ విభాగాధిపతిగా నియమితులైన రోహన్ దేశ్పాండే .. ముంబైకి చెందిన వారు. ఐహెచ్ఎం ముంబై నుండి హోటల్ మేనేజ్మెంట్లో పట్టా పొందారు. ఆయన కాక్రోచ్ పార్టీ టెక్నాలజీ సంబంధిత పనులను పర్యవేక్షిస్తారు. అలాగే ఫైనాన్స్ విభాగాధిపతి, పశ్చిమ జోన్ ఇన్ చార్జ్ గా నియమితులైన యోగేష్ ఇంగలే.. మహారాష్ట్రలోని పూణే నివాసి. ఆయనో చార్టర్డ్ అకౌంటెంట్. పార్టీ ఆర్థిక వ్యవహారాలకు బాధ్యత వహించడంతో పాటు, సంస్థ పశ్చిమ జోన్కు కూడా నాయకత్వం వహిస్తారు. తూర్పు, ఈశాన్య జోన్ అధిపతిగా నియమితులైన అంకిత్ భరద్వాజ్ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన వారు. ఆయన కూడా ఓ చార్టర్డ్ అకౌంటెంట్.




Click it and Unblock the Notifications